కొత్త టోకు ధరల సూచీ: ఆగస్టు ద్రవ్యోల్బణం 8.51శాతం

PTI Photo
PTI
కొత్త బేస్ ఇయర్ 2004-05 మరియూ కొత్త టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఈ)తో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా దిగివచ్చింది. ఆగస్టు నెలకు గాను ద్రవ్యోల్బణం 8.51 శాతంగా నమోదైంది. అదే పాత బేస్ ఇయర్‌ 1993-94 ప్రకారం చూస్తే ద్రవ్యోల్బణం 9.5శాతంగా ఉన్నట్లు కామర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మొత్తం మీద చూస్తే జులై నెలలో 9.78శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం కొత్త బేస్ ఇయర్, కొత్త టోకు ధరల సూచీ కారణంగా ఇది 1.27శాతం తగ్గి 8.51శాతానికి చేరుకుంది. కొత్త టోకు ధరల సూచీ ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ద్రవ్యోల్బణం 0.31శాతానికి తగ్గింది.

"ఇది (కొత్త టోకు ధరల సూచీ) వస్తువుల ధరలు ఎలా మారుతున్నాయనే అంశాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది" అని కామర్స్ మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు. అయితే ఆహార ద్రవ్యోల్బణం మాత్రం పరిగణించాల్సిన విషయమే అని ఆయన అన్నారు.
PTI Photo
PTI

ఈ కొత్త టోకు ధరల సూచీలో 241 కొత్త వినియోగ వస్తువులను చేర్చిన ఫలితంగా ద్రవ్యోల్బణం 1.3శాతం పాయింట్లు తగ్గి ఏడు నెలల కనిష్టానికి చేరుకుని 8.5శాతంగా నమోదైంది. అయితే కొత్త వస్తువులు చేర్చినప్పటికీ పాత వస్తువుల ధరలు మాత్రం నామమాత్రంగానే తగ్గాయి.

ఈ కొత్త టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణంతో పాటు పాత టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణంను కూడా ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం చూస్తే జులైలో 10శాతం ఉన్న ధరల పెరుగుదల ఆగస్టులో పాక్షికంగా తగ్గి 9.5శాతంగా నమోదైంది.

దీన్ని బట్టి చూస్తే కొత్త వస్తువులను చేర్చి ద్రవ్యోల్బణంను తగ్గించినప్పటికీ ధరల పెరుగుదలలో మాత్రం ఎటువంటి చలనం లేదని చెప్పవచ్చు. మరి ఈ తాజా గణాంకాలపై ఆర్‌బీఐ సెప్టెంబర్ 16న జరిపే ద్రవ్య విధాన సమీక్షలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి..!

వెబ్దునియా పై చదవండి