అర్థశాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి చెందిన ఆడంస్మిత్ 1723, జూన్ 16న స్కాట్లాండ్లోని కిర్కాల్డిలో జన్మించారు. ఈయన బ్రిటన్ దేశానికి చెందిన ప్రముఖ తత్వవేత్త మరియు ఆర్థికవేత్త. 1776వ సంవత్సరంలో ఈయన రచించిన "వెల్త్ ఆప్ నేషన్స్" గ్రంథం ద్వారా వెలుగులోకి వచ్చారు. సంప్రదాయ ఆర్థికవేత్త అయిన స్మిత్... స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడిదారీ విధానం, లిబర్టిలిజంలపై అనేక రచనలు చేశారు.
అరిస్టాటిల్, హాబ్స్, జాన్ లాక్, ఫ్రాంకోయిస్ కేనే మొదలగు పెద్దలవల్ల ప్రభావితుడైన స్మిత్కు, స్కాటిష్ తత్వవేత్త డేవిడ్ హ్యూమ్తో పరిచయం... ఆర్థిక సిద్ధాంతాల అభివృద్ధికి దోహదపడింది. 1776లో హ్యూమ్ మరణించేవరకు వారిద్దరి నడుమ స్నేహం కొనసాగింది. అర్థశాస్త్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడిన ఆడంస్మిత్... పై లోకాలకు తరలివెళ్ళిన రోజుగా చరిత్రలో జూలై 17వ తేదీ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
"వెల్త్ ఆఫ్ నేషన్స్"తో ప్రభంజనం
ఆడం స్మిత్ బ్రిటన్ దేశానికి చెందిన ప్రముఖ తత్వవేత్త మరియు ఆర్థికవేత్త. ఈయన 1776వ సంవత్సరంలో రచించిన "వెల్త్ ఆప్ నేషన్స్" గ్రంథం ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇది ఆయన ప్రముఖ రచనగానే కాకుండా, అర్ధశాస్త్రపు ముఖ్య రచనగా కూడా కొనసాగుతోంది...
ఆడంస్మిత్ స్కాంట్లాండ్ లోని కిర్కాల్డిలో 1723 జూన్ 5వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి కస్టమ్స్ కంట్రోలర్గా పనిచేసేవాడు. స్మిత్ నాలుగేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు జిప్సీలచే కిడ్నాప్కు గురవగా... ఆయన మామ వెంటనే ప్రతిస్పందించి తల్లి వద్దకు చేర్చాడు. అదలా ఉంచితే ఆడం స్మిత్ ఖచ్చితమైన పుట్టిన రోజు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
స్మిత్ 15 సంవత్సరాల వయస్సులో గ్లాస్గో విశ్వవిద్యాలయంలో నైతిక తత్వశాస్త్రం విద్యను అభ్యసించారు. ఇక్కడ ఉన్నప్పుడు స్మిత్ స్వేచ్ఛావాదం, తర్కం ప్రసంగాలలో నైపుణ్యం సంపాదించారు. 1740లో "స్మెల్ ఎగ్జిబిషన్ అవార్డు" పొందారు. ఆ తర్వాత ఆక్స్పర్డ్ లోని బాలియోల్ కళాశాలలో చేరారు కానీ... బ్రిటన్ విశ్వవిద్యాలయాలు ఆయనకు నచ్చలేదు.
1748లో స్మిత్ ఎడంన్బర్గ్లో ప్రసంగాలు ఇవ్వడం ప్రారంభించారు. 1750 ప్రాంతంలో ప్రముఖ తత్వవేత్త డేవిడ్ హ్యూమ్ను కలుసుకున్నారు. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్యా గాఢమైన స్నేహం కొనసాగింది. ఈ స్నేహం స్మిత్ ఆర్థిక సిద్ధాంతాల అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడింది.
1751లో స్మిత్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో తర్క పీఠాన్ని అధిష్టించాడు. 1752లో ఒకప్పుడు అతని గురువైన ప్రాన్సిస్ హచిసన్ అధిష్టించిన నైతిక తర్కశాస్త్రం పీఠాన్ని ఆక్రమించాడు. ఆ స్థానంలో తర్కం నుంచి రాజకీయ అర్థశాస్త్రం వరకు ఉపన్యాసాలను ఇచ్చేవారు. 1762లోనే గ్లాస్గో విశ్వవిద్యాలయం స్మిత్కు "డాక్టరేట్ ఆప్ లా" ప్రధానం చేసింది.
1773లో విశ్వవిద్యాలయాన్న్ని వదలిన స్మిత్... హెన్రీ స్కాట్కు ట్యూటర్గా పనిచేస్తూ, అతని వెంట 18 మాసాలపాటు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ బయలుదేరారు. ఆ సమయంలోనే ఈయనకు ఫిజియోక్రటిక్ స్కూల్కు చెందిన అర్థశాస్త్ర మేధావులను కలిసే అవకాశం లభించింది. ఫ్రాన్సుకు చెందిన ఫ్రాంకోయిస్ కేనే, జాక్వెస్ టర్గెట్ల ప్రభావం ఆయనపై బలంగా పడింది. స్మిత్ స్వస్థలం కిర్కాల్డి వచ్చిన తరువాత "లండన్ రాయల్ సొసైటీ ఫెలోషిప్"ను పొందారు.
ఆడం స్మిత్ 1776లో తన ప్రముఖ రచన "వెల్త్ ఆఫ్ ది నేషన్స్"ను రచించారు. ఆ తరువాత 1778లో స్కాట్లాండ్లో "కస్టమ్స్ కమీషనర్"గా నియమించబడ్డారు. 1783లో ఎడింబర్గ్ రాయల్ సొసైటీ సంస్థాపక సభ్యులలో ఒకరిగా అవతరించారు. 1787 నుంచి 1789 వరకు గ్లాస్గో విశ్వవిద్యాలయపు రెక్టార్గా కొనసాగుతూ... 1790, జూలై 17వ తేదీన 67 సంవత్సరాల వయసులో స్మిత్ పరమపదించారు.
ముఖ్యంగా ఆడం స్మిత్ రచించిన "వెల్త్ ఆఫ్ నేషన్స్" ఆయన ప్రముఖ రచనగానే కాకుండా, అర్ధశాస్త్రపు ముఖ్య రచనగా కూడా కొనసాగుతోంది. అర్ధశాస్త్రానికి సంబంధించిన అత్యంత విలువైన అభిప్రాయాలను ఆయన ఇందులో పొందుపరిచారు. దీనివల్లనే స్మిత్ అర్ధశాస్త్ర పితామహుడిగా కీర్తించబడ్డాడు. అర్ధశాస్త్రాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా తీర్చిదిద్దిన ఘన ఆడం స్మిత్కే దక్కుతుంది.