మన మెదడు అన్నింటినీ నిక్షిప్త పరుస్తుంది. కావలసినపుడు గుర్తు తెచ్చుకునేందుకు సహకరిస్తుంది. ఇలా సరిచూసుకునేందుకు మన మెదడు మనకు ఉపయోగపడుతూ, మరొకరికి అదే విజ్ఙానాన్ని కొన్ని ఏళ్ళ తరువాత అందించాలంటే కష్టమే మరి.
ఇక ఆ సమస్యనుంచి బయటపడటానికి మనిషి చేసిన ప్రయత్నమే 'పుస్తకం'. తాను అనుకున్న భావాలను వ్యక్తపరచడానికి పుస్తకాల రూపం సరిగ్గా సరిపోయింది. ప్రతి విషయాన్ని పరిశీలించి, శోధించి రాసిన పుస్తకాలు ఇన్ని అని చెప్పడం చాలా కష్టమైన పని. వీటిని భద్రపరిచే ప్రదేశాన్ని 'లైబ్రరీ' లేదా 'గ్రంథాలయం' అని పిలుస్తాం.
క్రీస్తు పూర్వమే లైబ్రరీలు పెట్టాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆనాటి గొప్ప రాజవంశీయుడు అబ్రహాం పరిపాలించిన నగరం 'ఉర్'. ఈ నగరంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాలలో రాజముద్రిక దొరికింది. చిన్న స్థూపాకారంలో ఉన్న ఈ ముద్రికపైన కొన్ని రాతలు కనుగొన్నారు. ఈ రాతలు క్రీస్తుపూర్వం 800 నాటివని తెలుసుకున్నారు. ప్రపంచంలోనే దీనిని మొట్టమొదటి లైబ్రరీగా నిర్థారించారు.
క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల మునుపే మెసపటోమియా వారు గుళ్ళలోను, తమ రాజ మందిరాల లోను గ్రంధాలయాలను నిర్మించారు. ఇక్కడ లైబ్రరీలో చదునైన రాతిపలకలను పుస్తకాలుగా వాడేవారు. వేల పుస్తకాలను ఒక క్రమపద్ధతిలో విషయాన్ని బట్టి గుళ్శలో, రాజమందిరాలలో భద్రపరిచేవారు. ఇదే మొట్టమొదటి లైబ్రరీ.
ఈజిప్టులోనూ ఇదే విధంగా దేవాలయాలను గ్రంధాలయాలుగా వాడేవారు. ఇక్కడి పూజారులు వీటిని సంరక్షించేవారు. పాపిరస్ అనే ఆకులతో తయారు చేసి చుట్టిన పత్రాలను వాడేవారు. వీటినే 'రోల్స్' అంటారు. మన నేటి లైబ్రరీల పోలికను కలిగి ఉంటాయి.
రోమన్లకు లైబ్రరీలంటే ఆసక్తి లేకపోయినా, గ్రీకు వారిని చూసి తామూ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే భావంతో ప్రారంభించారు. ప్రజలకు కావలసిన రీతిలో గ్రంధాలయాలు స్థాపించడానికి ఇదే సహకరించింది. నాలుగవ శతాబ్దంలో 28 ప్రజా గ్రంథాలయాలను స్థాపించారు. కాని ఉత్తర దేశీయుల రాచరికంలో అనాగరిక చర్యలవల్ల చాలా పుస్తకాలు నాశనమయ్యాయి.
నేడు మనం చూస్తున్న, వాడుతున్న లైబ్రరీలు 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ప్రారంభించినవి. ఇంగ్లాండ్ పార్లమెంట్లోని 1850వ చట్టం ప్రకారం పబ్లిక్ లైబ్రరీలు స్థాపించారు. అలా మొదలైన లైబ్రరీలే నేటి నాగరిక జీవనంలో మూలస్థంభాలుగా మారాయి.