ఎప్పుడు కావాలన్నా చచ్చిపోవచ్చు: కారుణ్య మరణం కేసుపై బ్రిటన్ కోర్టు
సోమవారం, 12 మార్చి 2012 (19:14 IST)
WD
చికిత్స లేదని వైద్యులు పేర్కొంటున్న ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తనను చట్టబద్ధంగా చంపమంటూ చేసుకున్న విన్నపానికి బ్రిటన్ కోర్టు ఒకటి సానుకూలంగా స్పందించింది. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చనిపోవచ్చంటూ సంచలన తీర్పు చెప్పింది.
టోనీ నిక్లిన్సన్ అనే 58 ఏళ్ల వ్యక్తి చాలాకాలంగా లాక్డ్-సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. దెబ్బమీద దెబ్బ అన్నట్లు 2005లో వచ్చిన పక్షవాతంతో అవయవాలన్నీ చచ్చుబడిపోయాయి. ఆ తర్వాత గొంతు కూడా పడిపోయింది. అయితే, వ్యాధి సోకిన వారి అవయవాలన్నీ చచ్చుబడిపోతాయి కానీ, బుద్ధి వివేకాలు పూర్తిస్థాయిలో సాధారణ వ్యక్తులకున్నట్లే ఉంటాయి.
అడుగు తీసి అడుగే వేయలేని దుస్థితితో పూర్తిగా కుటుంబ సభ్యుల మీదనే ఆధారపడి బతుకుతున్న టోనీ ఇక తన బతుకుకు ఇక అర్థం లేదనుకున్నారు. కుటుంబానికి భారం కాకుండా బలవంతంగా తనువు చాలించాలనుకున్నారు. అయితే, అందుకు అతని శరీరం సహకరించలేదు. ఆయన చనిపోవడానికి కూడా ఇతరుల సాయం కావాల్సి వచ్చింది. కానీ, అది హత్యానేరం కిందకొస్తుందంటూ ఆయన చనిపోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.
చివరకు ఆయన కోర్టును ఆశ్రయించారు. ఎవరయినా వైద్యుడు తనను న్యాయబద్ధంగా చంపేందుకు కోర్టు అనుమతిని మంజూరు చేయాలంటూ విన్నవించుకున్నారు. అయితే, దీన్ని ఆ దేశ న్యాయశాఖ వ్యతిరేకించింది. టోనీని చంపడానికి అంగీకరించడమంటే ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపడమేనంటూ వాదించింది. టోనీని చూసి రేపు భవిష్యత్తులో మరింతమంది తమను చంపేయాలంటూ ఆస్పత్రుల ముందు బారులు తీరుతారని పేర్కొంది.
ఈ కారణంగా తమ హత్యా నేర చట్టాన్ని సమూల మార్పులు చేయాలంటూ కోర్టుకు తెలియచేసింది. నిక్లిన్సన్ తన కేసు విచారణ సందర్భంగా ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరం సాయంతో కోర్టులో వాదించారు. తన మనోభావాలను పూసగుచ్చినట్లు న్యాయమూర్తి ఎదుట తెలియచేసారు. "నా జీవితం నిస్సారమయిపోయింది.. నికృష్టమయిన జీవితం గడుపుతున్నాను... భవిష్యత్తుకు అర్థమే మారిపోయింది.. గౌరవాన్ని కోల్పోయిన ఈ బతుకును నేను భరించలేను," అని తన మనోభావాలను నాలుగు ముక్కల్లో న్యాయమూర్తి హృదయానికి హత్తుకునేలా చెప్పారు. టోనీ మాటలతో ఏకీభవించిన కోర్టు ఆయనకు తన తనువు చాలించడానికి హక్కుందని పేర్కొంది.