అప్పులు చేసి గొప్పలకు వెళ్లి ఆడంబర పెళ్లిళ్లు చేసుకోవద్దు : సీఎం సిద్ధరామయ్య

బుధవారం, 27 సెప్టెంబరు 2023 (21:45 IST)
రుణాలు తీసుకుని, అప్పులు చేసి గొప్పలకు వెళ్లి ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడం మానుకోవాలని తమ రాష్ట్ర ప్రజలకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హితవు పలికారు. అదేసమయంలో సాధారణ, సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఆడంబరాలు కోసం చేసే అప్పులు తీర్చేందుకు జీవితాంతం కష్టపడాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
మైసూరు సమీపంలోని చామరాజనగర్‌లోని ఎంఎం హిల్స్ టెంపుల్‌లో బుధవారం జరిగిన సామూహిక కళ్యాణోత్సవంలో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ, అప్పులు చేసి లేదా రుణాలు పొంది వివాహ వేడుకలను ఘనంగా జరుపుకోవడం సరికాదన్నారు. వ్యవసాయ రుణాలు తీసుకుని ఆడంబరంగా పెళ్లి వేడుకలు నిర్వహించడం మానుకోవాలని కోరారు. 
 
పేదలు, మధ్యతరగతి ప్రజలు గొప్పలకు పోయి అప్పుల ఊబిలో కోరుకుపోతున్నారని, బయట రుణాలు తీసుకొచ్చి, ఆర్బాటంగా పెళ్లిళ్లు చేయడం ఎంతమాత్రం పద్ధతి కాదన్నారు. పేద, శ్రామిక వర్గాల ప్రజలు ఆడంబరాల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు జీవితాంతం కష్టపడాల్సి వస్తుందన్నారు. అందుకే సమాజం నిరాడంబరంగా జరిగే సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు