'అమ్మ'కు డిప్యూటీ ఎవరు.. తర్జనభర్జన.. పునరాలోచన... జయ శాఖలు మంత్రులకు బదిలీ

ఆదివారం, 9 అక్టోబరు 2016 (09:31 IST)
తీవ్ర అస్వస్థత, అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు డిప్యూటీ (డిప్యూటీ సీఎం)ని నియమించే విషయంలో అన్నాడీఎంకే మంత్రులు తర్జనభర్జన సాగుతోంది. మరోవైపు ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నారు. అదేసమయంలో జయలలిత సుదీర్ఘకాలం ఆస్పత్రిలోనే చికిత్స పొందాల్సి ఉండటంతో ఆమె నిర్వహిస్తూ వచ్చిన అన్ని శాఖలను ఇతర మంత్రులకు బదలాయించారు. ప్రస్తుతం రాష్ట్ర రోజువారీ పాలనా వ్యవహారాలను ప్రభుత్వ ప్రధాన సలహాదారు షీలా బాలకృష్ణన్, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు చక్కదిద్దుతున్నారు. 
 
తమిళనాడు మంత్రులు పన్నీర్‌ సెల్వం, పళణిస్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు శుక్రవారం గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగర్‌ రావుతో సమావేశమయ్యారు. అయితే, జయ గైర్హాజరీలో ఉప ముఖ్యమంత్రి ఎలా వ్యవహరిస్తారన్నదానిపై పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపముఖ్యమంత్రి పదవి ఒకరికి ఇస్తే, మిగిలిన సీనియర్లు అలుగుతారనీ చర్చ అపుడే మొదలైంది. 
 
అదేసమయంలో ఉపముఖ్యమంత్రి పదవిని సృష్టిస్తే కార్యకర్తలకు, ప్రజలకు 'భిన్నమైన' సంకేతాలు వెళతాయని పార్టీ అనుమానిస్తోంది. గతంలో ఎంజీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు అస్వస్థతకు గురయ్యారు. ఆయన శాఖల బాధ్యతలను సీనియర్‌ మంత్రులు ఒక్కొక్కటి స్వీకరించారు. ఇప్పుడూ జయలలిత వద్ద ఉన్న శాఖలను సీనియర్‌ మంత్రులు పంచుకుని, పాలన సాగేలా చూస్తే బాగుంటుందని అన్నా డీఎంకేలో కీలకంగా ఉన్న జయ సన్నిహితురాలు శశికళకు నేతలు చెప్పినట్లు తెలిసింది. ఆ సూచన మేరకే.. జయలలిత నిర్వహిస్తూ వచ్చిన శాఖలను ఇతర మంత్రులకు బదిలీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి