సమైక్యాంధ్రకే మా పార్టీ కట్టుబడి ఉంది: హీరో హరికృష్ణ

బుధవారం, 16 డిశెంబరు 2009 (14:01 IST)
ప్రధాన తెలుగుదేశం పార్టీ కూడా సమైక్య వాదానికే కట్టుబడి ఉందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజ్యసభ ఎంపీ, స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ తెలిపారు. అందరూ కలిసి ఉండాలన్నదే తమ అభిమతమని ఆయన బుధవారం ఢిల్లీలో స్పష్టం చేశారు.

దీనిపై ఆయన పార్టీ సీనియర్ నేత ఎం.మైసూరా రెడ్డితో కలిసి పార్లమెంట్ ఆవరణంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అర్థరాత్రి పూట తెలంగాణపై ప్రకటన చేయడంలో ఆంతర్యమేమిటని హరికృష్ణ ప్రశ్నించారు.

'తంబూలాలు ఇచ్చాం.. మీరే తన్నుకు చావండి' అనే చందంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందని ఆయన ఆరోపించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో వెలుగెత్తి చాటిన మహానేత ఎన్టీ.రామారావు అని ఆయన గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు, లక్ష్యాల ప్రకారం తెలుగువారంతా కలిసి ఉండాలన్నదే తన అభిమతమన్నారు.

ఇందులో మరో ప్రశ్నకు తావులేదన్నారు. అలాగే, తమ పార్టీ కూడా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని విడదీసేందుకు అంగీకరించబోమని హరికృష్ణ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి