నిందితులను కఠినంగా శిక్షిస్తాం: సీఎం రోశయ్య

మంగళవారం, 2 ఫిబ్రవరి 2010 (12:46 IST)
విద్యార్థి నాగ వైష్ణవి కిడ్నాప్ చేసి, హత్య చేసిన కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైష్ణవి కిడ్నాప్, హత్యపై, ఆమె తండ్రి పలగాని ప్రభాకర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.రోశయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైష్ణవి కిడ్నాప్, దారుణ హత్య, ఆమె తండ్రి గుండెపోటుతో మరణించడం తదితర అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైష్ణవి కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయవాడకు వెళ్లనున్నట్టు చెప్పారు. ఈ సంఘటనలపై విజయవాడ పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డిని ఫోనులో వివరణ కోరారు.

కూతురు మరణ వార్త తెలుసుకున్న ప్రభాకర్ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమన్నారు. వైష్ణవిని హత్య చేసిన నిందితులు ఎవరనేది పోలీసులు దర్యాప్తులో వెల్లడైందని వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి