వాళ్లిద్దరూ వలస పక్షులు: ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి

కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ, శంకరరావులు వలసపక్షులని ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి ధ్వజమెత్తారు. అలాంటి వారి మాటలు ఎలాంటి సందర్భంలోనూ నమ్మరాదని పద్మావతి దుయ్యబట్టారు. కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ వంటిదని పద్మావతి అన్నారు.

జగన్ ఓదార్పు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో పుల్లా పద్మావతి విలేకరులతో మాట్లాడుతూ.. మధుయాష్కీ, శంకరరావులపై నిప్పులు చెరిగారు. వలస పక్షులైన వారిద్దరూ మాటలను నమ్మరాదన్నారు.

కడప ఎంపీ వైఎస్ జగన్ ఎదుగుదలను ఓర్వలేని సీనియర్ నాయకులు లేనిపోని అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ బత్తల వెంకటరమణ, హిందూపురం ఇన్‌చార్జి అంబికా లక్ష్మీ నారాయణ అన్నారు.

జగన్ ఓదార్పు యాత్ర పూర్తి వ్యక్తిగతమన్నారు. ఓదార్పు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి సీనియర్ నాయకులు జీర్ణించుకోలేక అధిష్ఠానానికి దుష్ప్రచారాన్ని చేరవేస్తున్నారని వారు ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. ఓదార్పు యాత్రలో పాల్గొన వద్దని అధిష్టానం స్పష్టం చెబుతున్నా ఎమ్మెల్యేల ధిక్కార ధోరణి కొనసాగుతోంది. కడప జిల్లా పులివెందులలో రెండురోజుల పాటు సాగిన జగన్ యాత్రలో జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సంఘీభావం ప్రకటించడంపై పార్టీ ఆగ్రహంతో ఉందని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి