తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల దీక్షా డ్రామాపై అధిష్టానం సీరియస్!!

సోమవారం, 27 డిశెంబరు 2010 (13:40 IST)
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల వైఖరిపై ఆ పార్టీ అధినాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు న్యూఢిల్లీ వర్గాల సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తుది నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో ఈ ఎంపీల లొల్లి ఏమిటని అధిష్టానం పెద్దలు మండిపడినట్టు వినికిడి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అధినేత్రి రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది.

సొంత పార్టీకి చెందిన నేతలే ఈ తరహాలో వీధిన పడటంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం శాంతియుత వాతావరణాన్ని కల్పించాల్సిన గౌరవ పార్లమెంట్ సభ్యులే ఈ విధంగా దీక్షకు దిగడాన్ని పటేల్ జీర్ణించుకోలేక పోయినట్టు సమాచారం. తాను పార్లమెంటు సభ్యులతో మాట్లాడి నచ్చజెప్పడానికి ప్రయత్నించానని, అయినా ఎంపీలెవ్వరూ మాట వినడం లేదని అహ్మద్ పటేల్‌కు సీఎం స్పష్టం చేశారు.

కాగా, విద్యార్థులపై పెట్టిన కేసులను 26వ తేదీ లోగా ఎత్తేయాలని తాము అల్టిమేటం ఇచ్చామని, అయినా ముఖ్యమంత్రి స్పందించలేదని ఎంపీలు వాదిస్తున్నారు. అందుకే విధిలేని పరిస్థితుల్లో దీక్ష చేస్తున్నామని ఎంపీలు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి