తెరాసతో కలిసి పని చేయమంటున్నారు: తెదేపా నేత పోచారం
సోమవారం, 3 జనవరి 2011 (14:55 IST)
తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. పార్టీకి నిజామాబాద్ జిల్లాలో పట్టుగొమ్మగా ఉన్న మాజీ మంత్రి సీనియర్ నేత, బాన్స్వాడా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి గుడ్బై చెప్పనున్నారు. ఆయన సోమవారం తన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పని చేయాలని సూచించారన్నారు. అందువల్ల కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకోవాల్సి ఉందన్నారు. మెజారిటీ ప్రజల కోర్కె మేరకే తాను ఈ రోజు నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందన్నారు.
అయితే, ఈ అంశంపై తుది నిర్ణయాన్ని హైదరాబాద్ వచ్చి ప్రకటిస్తానని చెప్పారు. కోట్లాది మంది ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నారన్నారు. ఈ అంశంలో తెదేపా వైఖరి స్పష్టంగా లేదన్నారు. గతంలో తెలంగాణ అంశంపై ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఒక లేఖ ఇచ్చామని గుర్తు చేసిన ఆయన.. ఈ లేఖనే ఇపుడు కూడా పునరావృత్తం చేయమంటే సరైన స్పందన లేదన్నారు.
అందువల్లే తాను పార్టీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. దీనిపై హైదరాబాద్లో స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. ఇదిలావుండగా, మరికొంతమంది తెదేపా నేతలు తెరాస చీఫ్ కేసీఆర్తో మంతనాలు జరుపుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు భారీ సంఖ్యలో తమ క్యాడర్తో తెరాసలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.