11న హైదరాబాద్‌కు రానున్న ఆజాద్ : తెలంగాణపై ప్రకటన!!

బుధవారం, 9 నవంబరు 2011 (17:20 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. 11వ తేదీన నగరానికి చేరుకునే ఆయన.. తెలంగాణపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రాజకీయ నేతలల్లోనే కాకుండా ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో కేంద్ర మంత్రులు చిదంబరం, ఆజాద్‌లు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ బక్రీద్ పండగ తర్వాత సమస్యకు ఒక పరిష్కార మార్గం కనుగొంటామని ప్రకటించిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం పండుగ పూర్తయి రెండు రోజులు అయింది. ఈ నేపథ్యంలో ఆయన ఈనెల 11వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇటీవల తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆజాద్‌ను కలవడానికి అపాయింట్‌మెంట్ కోరగా తానే త్వరలో హైదరాబాద్ వస్తున్నట్టుగా వారికి చెప్పినట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి