ప్రజల మధ్య చిచ్చుపెడుతూ దేశ సమైక్యత, సమగ్రతలకు హాని చేస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని దేశం నుంచి బహిష్కరించాలని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్ర విభజనను సహకరించిన టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి ఉరి తీయాలన్నారు.
రాష్ట్ర విభజన అంశంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు 258 మంది అమాయకులు ప్రాణాలు తీసుకున్నారని, ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో రగులుతున్న విద్వేషాలకు సోనియా, చంద్రబాబు ఇద్దరూ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలుగా చలామణి అవుతున్న దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండేలు మోసపూరిత ప్రకటనలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే.. రాష్ట్ర విభనను ఆపేలా కేంద్రానికి ఆదేశించాలని కోరుతూ తాను సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశానని, దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరుపనుందన్నారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు కేంద్రానికి లేదన్నారు. ముఖ్యంగా.. మెజార్టీ సభ్యులు రాష్ట్ర విభజనకు సమ్మతించడం లేదని అందువల్ల విభజన అసాధ్యమని ఆయన చెప్పుకొచ్చారు.