పార్థసారథి భార్య రూ.45 లక్షలతో ఆర్టీసి బస్సులో... లెక్కలున్నాయ్

శనివారం, 19 ఏప్రియల్ 2014 (12:38 IST)
FILE
ఎన్నికలు 2014 నేపధ్యంలో ధనప్రవాహం ఏరులై పారుతున్న సందర్భంలో ఎన్నికల కమిషన్ తనిఖీలను ముమ్మరం చేయాలని చెప్పడంతో హైదరాబాద్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు మాజీ మంత్రి పార్థసారథి సతీమణి కమల వద్ద రూ.45. 10 లక్షల నగదును కనుగొన్నారు. గురువారంనాడు అర్థరాత్రి దాటిపోయిన తర్వాత పార్థసారథి సతీమణి బస్సులో హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణిస్తున్నారు. వనస్థలిపురం వద్ద కమల ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు తనిఖీ చేయగా ఆమె వద్ద 45 లక్షల రూపాయలు ఉన్నట్లు తేటతెల్లమయింది.

ఐతే కమల విజయవాడకు తీసుకెళుతున్న ఈ డబ్బు ఎక్కడిదని పోలీసులు ఆరా తీస్తే ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఆ డబ్బులకు తనవద్ద లెక్కలు ఉన్నాయని మాజీమంత్రి పార్థసారథి అంటున్నారు. తన భార్యను నగదుతో అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై విజయవాడలో పార్థసారథి మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభ అభ్యర్థి రూ. 70 లక్షల వరకూ ఖర్చు పెట్టవచ్చని ఉన్నదని తెలిపారు. ఎన్నికల ఖర్చు కోసమే కార్పొరేట్ బ్యాంక్ నుంచి ఆ నగదును తన సతీమణి డ్రా చేసుకుని వస్తున్నారని వివరించారు.

వెబ్దునియా పై చదవండి