పొన్నాల స్క్రిప్టును పఠిస్తున్న జైరాం రమేష్ : హరీష్ రావు

సోమవారం, 21 ఏప్రియల్ 2014 (14:16 IST)
File
FILE
కేంద్రమంత్రి జైరాం రమేశ్‌పై టీఆర్ఎస్ సిద్ధిపేట అభ్యర్థి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్క్రిప్టు రాసిస్తే జైరాం వాటిని చదువుతున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడిచిన వ్యక్తి ఆయనని మండిపడ్డారు. జైరాం చెప్పినట్లు నడుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు కూడా రావని హరీష్ రావు జోస్యం చెప్పారు.

ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... దొరలకు టికెట్లిచ్చిన కాంగ్రెస్, కమిటీల పేరుతో కాలయాపన చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

జరగబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. సీమాంధ్రలో చంద్రబాబు అధికారంలోకి రాకుంటే చంద్రబాబుకు పిచ్చెక్కడం ఖాయమన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సీమాంధ్ర నాయకులే ఇక్కడ ప్రచారం చేయాలా అని ప్రశ్నించారు.

తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి కావాలో సీమాంధ్ర నేతలే నిర్ణయించాలా. పోలవరం డిజైన్ మార్చాలంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు వైఖరి చెప్పరా? కాంగ్రెస్, టీడీపీ నాయకులు హుందాగా వస్తే ఎక్కడైనా చర్చకు టీఆర్‌ఎస్ సిద్ధమని హరీష్ రావు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి