పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి : లోక్ సత్తా జయప్రకాష్

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (18:27 IST)
File
FILE
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి అని.. ఆయన ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా చెపుతారని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ అన్నారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న జేపీకి తొలుత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రకటన మేరకు టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డికి పవన్ మద్దతు ఇస్తున్నట్టు బుధవారం పవన్ ప్రకటించారు.

దీనిపై జేపీ స్పందించారు. తనకు మద్దతిస్తానని తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఆ నిర్ణయాన్ని విరమించుకోవడం బాధ కలిగించిందన్నారు. పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి పెరగడం వల్లనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని చెప్పారు. పవన్ తన మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రాన తమ మధ్య ఉన్న స్నేహం చెడిపోదని తెలిపారు.

నిజమైన హీరోలు సామాన్య ప్రజలేనని... వారే తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానంలో ధర్మానికి, ధనానికి మధ్య పోటీ జరుగబోతోందన్నారు. కేవలం తన కోసమే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ నుంచి తప్పుకున్నారని... లేకపోతే మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేవారని చెప్పారు. పవన్ ఓ గొప్ప వ్యక్తి అని... మనసులోని మాటను నిజాయతీగా, ధైర్యంగా చెబుతారని కితాబిచ్చారు.

వెబ్దునియా పై చదవండి