తీవ్రవాదంపై సమిష్టి పోరు: ప్రధాని మన్మోహన్ సింగ్

ఆదివారం, 7 ఫిబ్రవరి 2010 (18:05 IST)
దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా పరిణమించిన తీవ్రవాదం, నక్సలిజం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు సమిష్టి పోరు అవసరమని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఢిల్లీలో ఆదివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దేశ అంతర్గత భద్రతపై ప్రధాని అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ సీఎంలకు పలు కీలక సూచనలు చేశారు. తీవ్రవాదం, నక్సలిజం సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలన్నీ సమన్వయంతో వ్యవహరించి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.

కేంద్ర హోం మంత్రి చిదంబరం మాట్లాడుతూ, నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో పరిపాలనా వ్యవస్థ సమర్థవంతంగా సాగేలా చూడాలని సూచించారు. నక్సల్స్ హింసాయుత కార్యకలాపాల కారణంగా దేశంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నక్సల్స్ వ్యవస్థను అంతమొందించేందుకు రాష్ట్రాలు పోలీసు శాఖకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. అలాగే, పోలీసు వ్యవస్థను ఆధునీకరణ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందని చిదంబరం ఉధ్ఘాటించారు.

వెబ్దునియా పై చదవండి