ఆ జర్నలిస్టుకు రూ.10 కోట్లు చెల్లించా: నిత్యానంద స్వామి!!

తమిళ సినీ నటి రంజితతో తాను సాగించిన రాసలీలల భాగోతాన్ని టీవీలో ప్రసారం చేయకుండా ఉండేందుకు ఆ జర్నలిస్టుకు 10 కోట్ల రూపాయలు చెల్లించినట్టు స్వామి నిత్యానంద కర్ణాటక పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ ఒక్క వాంగ్మూలమే నిత్యానంద తప్పు చేసినట్టు రుజువు చేస్తోందని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు. నిత్యానంద నిజంగానే తప్పు చేయకుండా జర్నలిస్టు బెదిరింపులకు లొంగి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదని, ఆ జర్నలిస్టుపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండవచ్చని వారు అంటున్నారు.

నిత్యానంద-నటి రంజిత రాసలీలల సీడీలు దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దీనిపై నిత్యానందతో పాటు రంజితపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వ్యవహారంపై నిత్యానందను హిమాచల్‌ప్రదేశ్‌లో అరెస్టు చేసి కర్ణాటకకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయనను బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, కర్ణాటక పోలీసులు జరిపిన విచారణలో నిత్యానంత తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించినట్టు చెప్పారు.

ఆ జర్నలిస్టు ఓ అడ్వకేట్‌తో కలిసి తన వద్దకు వచ్చి సిడీ విషయాన్ని బహిర్గతం చేశారు. తన ముందే కొన్ని క్లిప్పింగ్స్‌ను ప్రదర్శించి, ఈ సీడీని ప్రసారం చేయకుండా ఉండేందుకు రూ.25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత తమ మధ్య జరిగిన బేరసారాల్లో పది కోట్ల రూపాయలను ఒక ముఖ్య అనుచరుడి ద్వారా అందజేశాం. తమను బ్లాక్ మెయిల్ చేసిన జర్నలిస్టు డబ్బును తీసుకుని సీడీని ప్రసారం చేసినట్టు నిత్యానంద పోలీసులకు చెప్పినట్టు వెల్లడైంది.

అంతేకాకుండా, ఇటీవల విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన రంజిత కూడా తనకు కూడా డబ్బు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌ కాల్స్ వచ్చాయని రంజిత చెప్పడం గమనార్హం. అయితే, సెక్స్ రాకెట్ బహిర్గతమైన తర్వాత, వెల్లడి కాకముందు రంజితతో నిత్యానంద నిరంతరం టచ్‌లో ఉన్నట్టు ఈ విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా, సెక్స్‌కు సంబంధించి నోరు విప్పరాదని రంజితకు పదేపదే ఫోన్లు చేసి నిత్యానంద చెప్పినట్టు దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి