సోనియా డిశ్చార్జ్ .. ఆరోగ్యం భేష్ : ఎయిమ్స్ వైద్యులు

మంగళవారం, 27 ఆగస్టు 2013 (09:16 IST)
File
FILE
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి మంగళవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆహార భద్రతా బిల్లుపై సోమవారం రాత్రి లోక్‌సభలో వాడివేడిగా చర్చ సాగుతున్న సమయంలో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి ఛాతినొప్పి రావడంతో కేంద్ర మంత్రి సెల్జా, సోనియా తనయుడు రాహుల్ గాంధీలు హుటాహుటిన ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

వాస్తవానికి సోనియా గాంధీ ఆదివారం రాత్రి నుంచి వైరల్ జ్వరంతో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆమె తన ఇంట్లోనే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం ఆహార భద్రతా బిల్లుపై పార్లమెంటులో జరిగిన సుదీర్ఘ చర్చలో సోనియా పాల్గొన్నారు. ఇక ఓటింగ్ మాత్రమే మిగిలింది.

అయితే... రాత్రి 8.15 గంటల సమయంలో సోనియా స్వల్పంగా ఛాతినొప్పితో పాటు.. తీవ్రమైన అలసటకు గురయ్యారు. ఫలితంగా సభలో కూర్చోలేకపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో... కేంద్ర మంత్రి సెల్జా, కుమారుడు రాహుల్‌ గాంధీలు తోడు రాగా సభ నుంచి బయటికి నడిచారు.

ఒక దశలో కొద్దిగా తూలిపడిన సోనియా... వెంటనే సెల్జా ఆసారా తీసుకున్నారు. వాహనంలో కూర్చుని నేరుగా ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఎయిమ్స్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ ఆర్.సి.దేకాతోపాటు పలువురు వైద్య నిపుణులు సోనియాను పరీక్షించారు. ఆమెను హృద్రోగ విభాగంలో అడ్మిట్ చేసి పలు పరీక్షలు నిర్వహించారు.

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. మంగళవారం ఉదయానికి ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ఇంటికి డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి