తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. 29వ రాష్ట్రంగా...

గురువారం, 20 ఫిబ్రవరి 2014 (20:18 IST)
File
FILE
తెలంగాణ బిల్లుకు పెద్దల సభ రాజ్యసభ గురువారం రాత్రి ఆమోదముద్ర వేసింది. దీంతో భారతదేశంలో 29వ రాష్ట్రంగా హైదరాబాద్‌ రాజధానితో పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. ఈ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందడంతో 58 యేళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరినట్టయింది.

ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదించినట్టు డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్ ప్రకటించారు. అయితే, సుదీర్ఘ చర్చ తర్వాత ఓటింగ్ జరపాలని విపక్ష నేతలు పట్టుబడినప్పటికీ, డిప్యూటీ స్పీకర్ కురియన్ తిరస్కరించి మూజువాణి ఓటుకే మొగ్గుచూపారు.

ముఖ్యంగా తెలంగాణ బిల్లుపై చర్చ సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వెంకయ్య నాయుడు చేసిన అనేక కీలక సవరణలు వీగిపోయాయి. అయితే, సీమాంధ్రకు పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా కల్పించాలని వెంకయ్య చేసిన సవరణతో ప్రభుత్వం దిగివచ్చి ఐదేళ్ళు ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించింది.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో బీజేపీ ఎంపీ వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలపై సభ మూజువాణి ఓటుతో తిరస్కరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రకు రెవెన్యూ లోటు ఉందని, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు లేకపోతే అక్కడ జీతాలివ్వడం కూడా కష్టమేనని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడుకు కేంద్ర మంత్రులు షిండే, జైరాం రమేష్‌లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మధ్యంతర బడ్జెట్ పూర్తయినందున వెంకయ్య సూచించిన సవరణలు ఇప్పుడు చేర్చడం కుదరడని జైరాం రమేష్ బదులిచ్చారు. రెండు నెలల తర్వాతి బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి