బ్రిటీష్ శాస్త్రవేత్తల బృందానికి భాస్కర్ నాయకత్వం

భారత సంతతికి చెందిన ప్రముఖ విద్యావేత్త భాస్కర్ సేన్ గుప్తా... బ్రిటీష్ అత్యున్నత శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించనున్నారు. ఈశాన్య భారతదేశంలోని భూగర్భ జలాలలో ఆర్సినిక్ విష ప్రభావాన్ని నిరోధించేందుకు పరిశోధనలు జరుపనున్న శాస్త్రవేత్తల బృందానికి గుప్తా నాయకత్వం వహిస్తారని బెల్‌ఫాస్ట్ క్వీన్స్ యూనివర్సిటీ ప్రకటించింది.

ఇదిలా ఉంటే... భాస్కర్ సేన్ గుప్తా ప్రస్తుం బెల్‌ఫాస్ట్ క్వీన్స్ యూనివర్సిటీలోని ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతంలో యూరోపిన్, భారత శాస్త్రవేత్తల బృందం ఈయన నేతృత్వంలోనే తక్కువ ఖర్చుతో నీటి నుంచి ఆర్సినిక్ లోహాన్ని వేరుచేసే పరిజ్ఞానాన్ని కనుగొంది.

కాగా... ఈశాన్య భారతదేశంలోనూ, బంగ్లాదేశ్‌లోనూ సుమారు 70 లక్షల మందికంటే ఎక్కువగానే ప్రజలు త్రాగునీరు, ఆహారం ద్వారా ఆర్సినిక్ విష ప్రభావానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో మన దేశానికే చెందిన భాస్కర్ సేన్ గుప్తా ఈ ఆర్సినిక్ విష ప్రభావాన్ని నిరోధించే పరిశోధనలకు పూనుకోవడం గర్వించదగ్గ విషయం.

వెబ్దునియా పై చదవండి