శనిగ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు. ఒకసారి శనిదేవుడు హనుమను సమీపించి "మారుతీ! నేను శనిని, అందర్ని పట్టి బాధించాను. ఇంత వరకు నిన్ను పట్టుకోలేదు. ఇప్పుడు చిక్కావు.'' అన్నాడు. దానికి హనుమ "శనీశ్వరుడా! నన్ను పట్టుకొంటావా? లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావు?'' అని ప్రశ్నించాడు.
అప్పుడు శని, హనుమంతుని శిరస్సు మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకొన్నాడు ఆంజనేయుడు. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. ఒక మహా పర్వతాన్ని పెకలించి నెత్తిమీదకు ఎత్తుకొన్నాడు.
కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిల తన్నుకొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు. ఊపిరాడక శని వలవల ఏడ్చేశాడు.
తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ, ఏడుస్తూ ప్రార్ధించాడు. శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి "మందా! నన్ను పట్టుకొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు. అప్పుడే గిజ గిజలాడి పోతున్నావే?'' అని ప్రశ్నించాడు. "ప్రజలను బాధించటమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు. అందుకని నిన్ను ఒక రకంగా శాశించి వదిలి పెడతాను'' అన్నాడు. గత్యంతరం లేక శని సరేనన్నాడు.
హనుమ "శనీశ్వరా! నా భక్తులను బాధించ రాదు, నన్ను పూజించే వారిని, నా మంత్రాన్ని జపించేవారిని, నా నామస్మరణ చేసే వారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసే వారిని ఏ కాలంలోనైనా ముట్టుకోకూడదు, బాధించ రాదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను'' అని చెప్పి, శనితో వాగ్దానం చేయించుకొని వదిలి పెట్టాడు. అందుకే శనివారానికి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది.
శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శనీశ్వరుడి శరీరమంతా గాయాలై బాధించాయి. ఆ బాధా నివృత్తికే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించడు.
అందుకే శనివారం రాగానే హనుమంతుని పూజించాలి. ఆయన శనివారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. అందుకే శనివారం చేసే హనుమంతుని పూజ సకల శ్రేయస్సును ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు.