వాస్తు ప్రకారం గృహ శంకుస్థాపన

గురువారం, 31 జులై 2008 (18:53 IST)
గృహనిర్మాణము చేయదలచినట్లైతే భూమి యందు మొదటగా శంకుస్థాపన నిర్వహించాలని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు. వాస్తు దేవతలను సంతృప్తి పరచి, భూదేవిని పూజించిన పిమ్మట తమకు అనుకూలమైన లగ్నం, చంద్ర, తారాబలం కూడిన శుభసమయంలో గృహనిర్మాణాన్ని ఆరంభించాలని, దీనినే శంకుస్థాపన అంటారని వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం రాళ్ళను, ఇటుకరాళ్ళను పెట్టి భూదేవీ పూజను నిర్వహించి శంకుస్థాపన చేస్తున్నారని అయితే పూర్వం గృహ నిర్మాణానికి ముందు శంఖువును తయారుచేయాలని, శంఖు తయారీలో గానుగ, మద్ది, వేప, కడప, కొడిశపాల, శ్రీతాలము, వెదురు, చండ్ర, మారేడు, చెట్లకు సంబంధించిన మొక్కలను వాడటం చేస్తుంటారని వాస్తు శాస్త్రం తెలుపుతోంది.

శంఖు తయారీకి చండ్రకొయ్యని వాడటం మంచిదని వాస్తు తెలుపుతోంది. శంఖువును కడిగి పంచామృతముతో అభిషేకము చేయాలని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత పసుపు, గంధము, కుంకుమ, కస్తూరి, కర్పూరము తదితర సుగంధ ద్రవ్యాలను పెట్టి వస్త్రములో చుట్టి సాంబ్రాణిహారతులు పట్టి నవరత్నాలు, సువర్ణాలు, నవధాన్యాలు, సమర్పించి శుభ ముహుర్తంలో యోగ్యమైనచోట స్థాపించాలని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి