నేడే తిరుమలలో "ఆణివార ఆస్థానం"

తిరుమలేశుని వార్షిక ఆదాయ వ్యయాల ప్రారంభ సూచికగా ఆనవాయితీగా నిర్వహిస్తోన్న 'ఆణివార ఆస్థానం' గురువారం తిరుమలలో వైభవంగా నిర్వహించనున్నారు.

ఆలయం బంగారు వాకిలిలోని మహామణి మండపంలో ఉత్సవర్లు, విష్వక్సేనుల వారిని వేర్వేరు పీఠాలపై ఉంచి ఆస్థానం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా తోమాల, అర్చన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఎస్డీ సేవ తదితరాలను రద్దు చేశారు. అదేవిధంగా గురువారం సాయంత్రం స్వామివారు పుష్పపల్లకిలో తిరుమాడవీధుల్లో ఊరేగుతారు.

ఇదిలా ఉండగా, స్వామివారి పుష్పపల్లకి సేవకు తమిళనాడుకు చెందిన ఎంవీఎస్ అనంతకృష్ణన్ అనే భక్తుడు 8లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. పుష్పపల్లకిని వివిధ రకాలైన అరుదైన పుష్పాలతో అలంకరించారు. బెంగళూరు, చెన్నై, మైసూరు వంటి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు పుష్పపల్లకిని అద్భుతంగా తయారు చేశారు.

మరోవైపు శ్రీవారి దర్శనార్థం మహాద్వారం నుంచి అనుమతించే చంటిపిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు, వయోవృద్ధులకు గురువారం నుంచి వేలిపై ఇంకు ముద్రను వేసి దర్శనానికి అనుమతిస్తారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, భక్తులు రెండోసారి ప్రవేశించకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అమలు చేయాలని ఈవో నిర్ణయించారు.

వెబ్దునియా పై చదవండి