తదుపరి మ్యాచ్‌కు సిద్ధమని ప్రకటించిన పీటర్సన్

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (12:14 IST)
File
FILE
గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ ఏడో అంచె పోటీలకు దూరంగా ఉంటున్న ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఇపుడు కోలుకున్నాడు. తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, తదుపరి మ్యాచ్‌కు సిద్ధమని ప్రకటించారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ చాలా సుదీర్ఘమైన టోర్నమెంట్. ఈ టోర్నీలో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన మా జట్టు కేవలం ఒక విజయాన్ని మాత్రమే సాధించింది. గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన నేను దుబాయ్‌లో ఈ నెల 25వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగగలనని భావిస్తున్నా అని తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

కాగా, ఐపీఎల్ ఏడో ఎడిషన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైనప్పటికీ ఈ నెల 19వ తేదీన కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి