కామినేని వైద్యుల నిర్లక్ష్యం.. ఇంజెక్షన్ వికటించి నల్గొండ అమ్మాయి మృతి..!

గురువారం, 7 జులై 2016 (12:50 IST)
వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన మీనాక్షి గత కొద్దిరోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. జూన్‌లో ఆమెకు ఫిడ్స్ రావడంతో నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ఆమెకు పది రోజుల పాటు చికిత్సను అందించారు. 
 
పరిస్థితి చేజారిపోవడంతో సికింద్రాబాద్ గాంధీఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మీనాక్షికి ప్రత్యేక వైద్యం అందించడానికి గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, డీవీయల్ (డెర్మాటాలజీ, వెనిరాలజీ, లెప్రసీ) వైద్యులు తమవంతు ప్రయత్నం చేశారు. ఆమెకు ఖరీదైన మందులను తెప్పించి అందించారు. కాని ఫలితం లేకుండా చికిత్స పొందుతూ మృతి చెందింది.
 
గత నెల జూన్‌లో ఆమె జ్వరంతో ఫిడ్స్ వచ్చి బాధపడుతుండటంతో తండ్రి కామినేని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అన్ని వైద్య సదుపాయాలున్నఆసుపత్రి కావడంతో తన కూతురి ఆరోగ్యం మెరుగవుతుందని ఆశించిన ఆ తండ్రి చికిత్స అనంతరం తన కూతురిని చూసి కుమిలిపోయాడు. వైద్యులు గ్లూక్లోజ్‌లో ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి ఆమె శరీరమంతా గుర్తుపట్టలేని విధంగా తయారైంది. దీంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని కామినేని వైద్యులు చెప్పారు. ఇలా జూన్ 22న మీనాక్షిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. 
 
మీనాక్షి మృతిపై గాంధీ ఆసుపత్రి సూపరిడెంట్ జె.కె.రెడ్డి మాట్లాడుతూ కెమికల్ రియాక్షన్ వల్ల శరీరం పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. ఉష్ణోగ్రతను నియంత్రిచడంలో చర్మం పాత్ర కీలకమైందని, శరీరమంతా పూర్తిగా కాలిపోవడంతో ఇది సాధ్యం కాలేదని, అందుకే మీనాక్షి మరణించిందని తెలిపారు. నెల రోజుల పాటు కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన మీనాక్షి మంగళవారం మరణించింది. 
 
అయితే మీనాక్షి బంధువులు కొందరు మాట్లాడుతూ... గాంధీవైద్యులు తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందించినప్పటికీ బిడ్డ దక్కకపోవడం తమకు బాధను కలిగించిందని అన్నారు. కామినేని ఆస్పత్రి తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి తమ బిడ్డ మీనాక్షికి జరిగిన అన్యాయం మరేవరికి జరుగకుండా చూడాలని కోరనున్నట్లు వారు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి