తెలంగాణ రాష్ట్ర సాధనలో తెరాస అధినేతగా కేసీఆర్ చేసిన కృషి, ఎదుర్కొన్న సవాళ్లు, రాష్ట్రాన్ని సాధించిన తీరు నేపథ్యంలో కేసీఆర్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించనున్నట్లు దర్శకుడు మధుర శ్రీధర్ వెల్లడించారు. ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది జూన 2న ప్రారంభంకానున్న ఈ సినిమా గురించి మధురశ్రీధర్రెడ్డి మాట్లాడారు.
''1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మా నాన్న చెప్పే సంగతులు వింటూ పెరిగాను. అనాటి సంగతులు, నేను చూసిన ఈనాటి సంఘటనలు నాలోని దర్శకుడిని కొన్నాళ్లుగా నిద్రపోనియలేదు. ఈ క్రమంలో కొన్ని పరిశోధనలు చేశా'' అని ఆయన చెప్పారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమకారుల్ని విడివిడిగా కలిశానని వివరించారు.
మహాత్మగాంధీ, మార్టిన్ లూథర్కింగ్, నెల్సన్ మండేలా వంటి వ్యక్తులకు ఏ మాత్రం తీసిపోకుండా అత్యంత సంక్లిష్టమైన, భయంకరమైన సవాళ్లను కేసీఆర్ ఎలా ఎదుర్కొన్నారనేది తెలుసుకున్నాక ఆయన చరిత్రను తెరపైకి తీసుకురావల్సిందేనని దర్శకుడిగా నిర్ణయించుకున్నానని శ్రీధర్ అన్నారు. అయితే ఈ సినిమాను వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా నిర్మించబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
సినిమా పేరు 'ఆర్ సీ కే' అని కూడా ప్రకటించారు. కేసీఆర్ బయోపిక్ను తెరకెక్కిస్తున్నామంటూ మధుర శ్రీధర్ ప్రకటించిన 24 గంటల్లోపే... తాను కూడా కేసీఆర్ సినిమా తీయబోతున్నానంటూ వర్మ ప్రకటించడం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, తాను ఈ సినిమా తీయాలనుకోవడానికి గల కారణాలను కూడా ట్విట్టర్ ద్వారా వర్మ వెల్లడించాడు. కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్తో సుదీర్ఘమైన చర్చ సందర్భంగా, కేసీఆర్పై సినిమా తీయాలనే ఆలోచన కలిగిందని ఆయన ట్వీట్ చేశాడు.