బాహుబలి-2 సినిమా చుట్టూ ఏర్పడుతున్న క్రేజ్ మొత్తంగా కోర్టు కేసుల పరం అవుతోందా.. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో బాహుబలి2 చిత్రం విడుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు తాజాగా తమిళనాడులో బాహుబలి-2 సినిమాను నిలిపివేయాలని కోరుతూ కోర్టులలో పిటిషన్ దాఖలు కావడం చిత్ర నిర్మాతలకు బేజారు పుట్టిస్తోంది. ప్రముఖ తమిళ సినిమా డిస్ట్రిబ్యూటర్ శరవణన్ తనకు రావలిసిన బకాయిలు చెల్లించేవరకు బాహుబలి-2 విడుదలను నిలిపివేయాలని కోర్టుకెక్కారు. రూ.1.18 కోట్ల మేర బకాయిలు తనకు అందాల్సి ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.
'బాహుబలి ది బిగినింగ్' కి సీక్వెల్ అయిన బాహుబలి-2 ఈ నెల 28న దేశంలోనే రికార్డు సంఖ్య థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రాజెక్టు బాహుబలి. అయితే మూవీ రిలీజ్ను అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఆ చిత్ర యూనిట్తోపాటు సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శరవణన్ దాఖలు చేసిన పిటిషన్ త్వరలోనే విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.
చెన్నయ్లో మీడియాతో జరిగిన సమావేశంలో రాజమౌళి కర్ణాటకలో బాహుబలి-2 సినిమా విడుదలకు ఎదురవుతున్న అడ్డంకుల గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటేశారు. చిత్రం ఆడియో రిలీజ్ ఘనంగా నిర్వహించుకుండా విడుదలకు ఉత్సాహపడుతున్న నేపథ్యంలో నెగటివ్ వార్తల గురించి చర్చ ఎందుకండీ అంటూ సున్నితంగా తప్పించుకున్నారు దర్శకుడు.
కానీ ఇప్పుడు అదే తమిళనాడులో పాత బకాయిలు కక్కుతారా, చస్తారా అంటూ పేరున్న పంపిణీదారు కోర్టుకెక్కడంతో చిత్రయూనిట్ తల పట్టుకుంటోందని సమాచారం. మూవీ దర్శకుడు, నిర్మాతలుగానీ ఈ పిటిషన్పై ఏ విధంగానూ స్పందించలేదు కానీ త్వరలోనే ఈ పిటిషన్ విచారణకు వస్తుందని భావిస్తున్నారు.