గాంధీజీ - కలాంలు ఇప్పటి ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు రావు
సోమవారం, 2 జులై 2012 (18:56 IST)
WD
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం లాంటివారు ఎన్నికల్లో పోటీ చేస్తే వారికి డిపాజిట్లు కూడా రావని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. "యంగిస్తాన్" కార్యక్రమంలో భాగంగా ఆర్కే తన భావాలను వెల్లడించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, స్ఫూర్తిప్రదాతలుగా పేరొందిన గాంధీజీ, అబ్దుల్ కలాం వంటివారు ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావన్నారు. యువత చెప్పడానికేమో తమకు అలాంటి నాయకులు కావాలీ అని అంటారు... కానీ ఓటు దగ్గరకు వచ్చేసరికి వ్యవహారం మరోలా ఉంటుందని అన్నారు. ఓటు వేసేటపుడు మచ్చలేని నాయకుడెవరన్న సంగతి తెలిసినా, అతడిని వదిలేస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ ముఖ్యమంత్రిగా మీరు వైఎస్సార్ను చెపుతారా... చంద్రబాబును చెపుతారా.. అని ఓ విద్యార్థి ప్రశ్నించినపుడు, ఇద్దరు నాయకుల్లోనూ మంచి ఉందనీ, అదేవిధంగా లోటుపాట్లు కూడా ఉన్నాయన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... అవినీతి నాయకులకు దయచేసి యువత ఓటు వేయరాదన్నారు. అలాంటి వారికి ఓటు వేస్తే అవినీతిని ప్రోత్సహించినట్లవుతుందని చెప్పారు.