దేశ భాషలందు తెలుగు లెస్స...

"మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు" అంటూ తెలుగు నేలను తల్లిగా కీర్తించిన శంకరంబాడి సుందరాచారి, "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా" అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తి చాటిన వేములపల్లి శ్రీకృష్ణ, తెలుగు తల్లి సాంస్కృతిక దర్పాన్ని తమ రచనల ద్వారా తెలియజెప్పిన అనేక వేల యువ సాహితీ కుసుమాల కల్పవృక్షం ఆంధ్రప్రదేశ్.

ఈ వృక్షానికి సాహితీ సుమాలే కాదు సంప్రదాయ సిద్ధాంతాలు కూడ వాడని పువ్వులై విరబూస్తుంటాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగ ఫలితంతో ఆవిర్భవించిన తెలుగు పుణ్యగడ్డ తెలుగుభూమి. దక్షిణ భారతంలోనేగాక యావద్భారత దేశంలోనే సంప్రదాయాలకు పెద్దపీట వేసి ప్రత్యేకతను సంతరించుకున్న ఈ రాష్ట్రం ఏర్పడి నేటికి 52 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 53వ వసంతంలోకి అడుగిడింది.

సంస్కృతీ సంప్రదాయాల ఆచరణలో అర్థ శతాబ్దం క్రితం ఎలా ఉందో ఆధునిక శతాబ్దంలో కూడా వాటికి అంతే విలువిస్తూ, వాటిని కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో నడుస్తోంది. పైగా ఈ ఆంధ్ర రాష్ట్ర దినోత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. అది... తెలుగు భాషపట్ల ప్రజల్లో మమకారాన్ని పెంపొందింపజేసేందుకు తెలుగు రచయితలు గత ఏడాదిగా చేస్తున్న కృషికీ, తెలుగు భాషకు ప్రాచీన భాషగా గుర్తింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్న పోరాటానికీ రాష్ట్రవ్యాప్తంగా విశేష ప్రతిస్పందన లభించడం.

అందుకే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవానికి గతంలో లేని ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తెలుగు జాతిపట్ల మాతృ భాషాభిమానం పెరిగేట్లు చేశాయి. అందులో ముఖ్యమైనది కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదాను కల్పించడం. ఇది భాషాభిమానులను తీవ్ర ఆనందానికి గురిచేసింది. వివిధ మాండలికాలలో రచనలు చేస్తున్న కవులు, రచయితలను ఒకే తాటిపైకి వచ్చి నిర్వహించిన అనేక సదస్సులు, సమావేశాలకు ఫలితం దక్కింది.

అత్యంత ప్రాచీనమైన ఈ భాషకు ప్రభుత్వపరంగా ప్రాచీన హోదా లభించినప్పటికీ.. భాషల ప్రాధాన్యతా క్రమంలో ప్రపంచ భాషలలో 6వ స్థానం, భారతదేశంలో 2వ స్థానం లభించడం ఈ భాషపట్ల భాషారాధకుల ప్రేమను తెలుపుతోంది. ఏ భాషకూ లేని ప్రత్యేక నుడికారాల సొంపు, భాషా సౌలభ్యం, మాట్లాడుతున్నా, వింటున్నా ఆత్మానందాన్ని కలిగించే సహజసిద్ధమైన భావ సౌందర్యం ఈ భాషకు ఉండడమే ఇందుకు కారణం.

తెలుగు భాషకు బలం అందులోని జాతీయాలు. అనువాదాలకు అందనివవి. వీటిని మరో భాషలోకి తర్జుమా చేసి వాటిని తమ భాషల్లోకి కలిపేసుకునేందుకు చేస్తున్న ఇతర భాషా శాస్త్రవేత్తల కృషి ఏమాత్రం నెరవేరదు. "తెలుగు నుడికారపు సొంపు" అనేది నాలుగు వేదాలలోని నాలుగు మహా వాక్యాల్లా నాలుగు దిక్కుల్లో శాశ్వతంగా నిలిచిపోయిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఇంత గొప్ప భాష కాబట్టే "దేశ భాషలందు తెలుగు లెస్స" అని ప్రస్తుతించబడింది, "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్"గా కొనియాడబడింది.

భాషాప్రయుక్తంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రంలో భాష మనుగడ గురించి ఆందోళనపడే పరిస్థితి రావడం దురదృష్టకరం. తానా, ఆటా, సిలికాన్ వేలీ లాంటి సంఘాలు విదేశాల్లో తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు సాంస్కృతిక వైభవానికి, తెలుగు భాషా వికాసానికీ ఎంతగానో కృషి చేస్తున్నాయి. ప్రతి ఏటా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు జాతిని ఏకమొత్తంగా నిలుపుతున్నాయి. వారిలో జాతీయాన్ని పెంపొందిస్తున్నాయి.

ఇది ఎంతైనా హర్షణీయం. తెలుగు వారికి ఎంతో దూరంగా ఖండాంతరాలలో ఉన్న వారే ఎంతో ఘనంగా తెలుగు జాతి కీర్తి కెరటాలను ఎగురవేస్తుంటే తెలుగు నేల మీద ఉన్న మనం మరెంతగా తెలుగు జాతి ఏకీకరణకు కృషి చేయాలో ఆలోచించాల్సిన సమయమిది. నిర్లక్షం నిజాయీతిని ప్రశ్నిస్తుంది. అందుకే తెలుగును కేవలం వాడుక భాషగా మాత్రమే గుర్తిస్తున్న మనలో ముందు ఒక పరివర్తన కలగాలి. దానికి వేదిక మన ఇల్లే కావాలి.

వెబ్దునియా పై చదవండి