పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెరువు సూరి జైలులో ఉన్న సమయంలో తాను కూడా పలు సెటిల్మెంట్లు చేశానని సూరీ హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్ అలియాస్ భాను అంగీకరించాడు. సూరీ జైలు నుంచి విడుదలైన తర్వాత తాను చేసిన సెటిల్మెంట్ల గురించి తెలిసి వాటి ద్వారా సంపాదించిన డబ్బు, ఆస్తులను ఇవ్వమని బెదిరించాడని అందుకే సూరీని రివాల్వర్తో కాల్చి చంపినట్టు భాను వాంగ్మూలం ఇచ్చాడు. ఈ విషయాన్ని పోలీసుల ఇంటరాగేషన్లో సూరీ వెల్లడించినట్టు సీఐడీ అధికారులు బుధవారం కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్నారు.
అంతేకాకుండా.. దాంతోపాటు నలుగురి ముందు తనను అసభ్యకర పదజాలంతో దూషించేవాడని చెప్పాడు. పగటి సమయంలో సూరి ఎవరినైనా చంపుతానంటే ఖచ్చితంగా చంపేవాడని, తనను కూడా రెండు మూడుసార్లు పగటి వేళల్లో నువ్వు కూడా చస్తావు.. ఎన్నో రోజులు బతకవు... నా చేతుల్లో నువ్వు చావటం ఖాయమని సూరి బెదిరించాడని చెప్పాడు. ఆ భయంతోనే సూరి హత్యకు పథకం వేశానన్నాడు. దాని ప్రకారం తన వద్ద ప్రైవేట్ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న మన్మోహన్ ద్వారా సూరి కారులో రివాల్వర్ను పెట్టించి హత్య చేసినట్టు చెప్పాడు.
కాగా, ఈ చార్జిషీటులో భానును ప్రధాన నిందితునిగా పేర్కొన్న సీఐడీ అధికారులు ఆ తర్వాత వరుసగా మన్మోహన్, సుబ్బయ్య, వెంకటరమణ, వెంకట హరిబాబు, వంశీధర్డ్డిని నిందితుల జాబితాలో చేర్చారు. 23 పేజీలతో తయారు చేసిన చార్జిషీట్లో 117మంది సాక్షులను విచారించినట్టుగా సీఐడీ అధికారులు పేర్కొన్నారు. 2011, జనవరి 3న భాను పకడ్బంధీగా రూపొందించుకున్న పథకం ప్రకారం సూరిని హైదరాబాద్లోని కృష్ణానగర్ సమీపంలో రివాల్వర్తో కాల్చి చంపిన విషయం తెలిసిందే.