ఆంధ్రా సబ్ ఏరియా డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర బుధవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్మెన్ ఆసుపత్రి(పాలిక్లినిక్)నిర్మాణానికి కృష్ణా జిల్లాలో ముఖ్యంగా విజయవాడ సమీపంలో మచిలీపట్నం జాతీయ రహదారి మార్గంలో స్థలం కేటాయించాలని సిఎస్కు విజ్ణప్తి చేశారు.
ఎక్స్ సర్వీస్మెన్ ఆసుపత్రి కరెంట్ బిల్లుల విషయాన్ని కూడా బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర సిఎస్ దృష్టికి తెచ్చారు. అదేవిధంగా గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద ఆర్మెడ్ ఫోర్సెస్కు చెందిన నాగిరెడ్డి, గోవిందరెడ్డిలకు సంబంధించిన ఇళ్ళకు నష్టం కలిగించిన వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సిఎస్ దృష్టికి తెచ్చారు.
ఇందుకు సంబందించి వెంటనే తగిన ప్రతిపాదనలను ఇవ్వాలని బ్రిగేడియర్ అభిజిత్ చంద్రకు సిఎస్ సూచించారు.నరసరావుపేట వద్ద ఆర్మడ్ ఫోర్సెస్ కు చెందిన సిబ్బంది ఇళ్లకు నష్టం కలిగించిన వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలక్టర్ కు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు.ఆంధ్రా సబ్ ఏరియా ప్రాంతంలో మాజీ సైనికుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను సిఎస్ ఆదిత్యానాద్ దాస్ బ్రిగేడియర్ అభిజిత్ చంద్రను అడిగి తెల్సుకున్నారు.