అమరావతి అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ప్రవేశపెట్టారు. స్వరాష్ట్రంలో కొత్త సచివాలయంలో ఆయన ఈ బడ్జెట్ను తొలిసారి సమర్పించారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. 2017-18 బడ్జెట్ వినూత్నంగా... అన్ని రంగాలు, వర్గాలకు న్యాయం చేసేలా ఉందన్నారు.
బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. యువతకు నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్లో రూ.500కోట్లు కేటాయించామన్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రాధాన్యతలను మేళవించి బడ్జెట్ను సమతూకంగా రూపొందించామన్నారు. ‘బీసీల సంక్షేమానికి ఏకంగా రూ.10 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
అలాగే, మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ రాష్ట్ర ప్రజలకు పాలన చేరువ చేసే లక్ష్యంతోనే హైదరాబాద్ నుంచి ముందుగానే అమరావతికి పాలన తీసుకొచ్చామన్నారు. ‘ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. ఎన్నో అంశాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే తలమానికంగా నిలుస్తోంది. విభజనతో ఎన్నో రంగాలకు ఊతమివ్వడం, అందరికీ ఉపాధి కలిగించేలా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం, సుపరిపాలన అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
ఆ తర్వాత శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. అయితే, వార్షిక బడ్జెట్పై విపక్ష పార్టీ వైఎస్.జగన్తో పాటు.. ఇతర విపక్ష పార్టీలు పెదవి విరిచాయి.