బీసీలు బలమైన నాయకులుగా ఎదగాలి: సజ్జల

మంగళవారం, 29 జూన్ 2021 (06:55 IST)
రాష్ట్రంలో బీసీలను వెనుకబడిన తరగతులుగా కాక సమాజానికి వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ సలహాదారులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

బీసీల అభ్యున్నతికి కట్టుబడి, రాష్ట్రంలో ఒక బలమైన నూతన బీసీ నాయకత్వాన్ని తయారు చేయాలనే ధ్యేయంతోనే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని, గ్రూపు రాజకీయాలకు అతీతంగా ఆయా కులాల సంక్షేమంపైనే ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. తద్వారా పార్టీ పటిష్టతకు కృషి చేస్తూనే బలమైన నాయకులుగా ఎదగాలని కోరారు.
 
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, బీసీలను గుర్తించి వారికి ఇంత పెద్దపీట వేసిన ముఖ్యమంత్రులు గతంలో ఎవరూ లేరని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులు ఉన్నత స్థాయికి ఎదిగేలా వారికి అన్ని రంగాల్లో సీఎం జగన్‌ సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు.

సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేసిన స్థలంలోనే బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్ల చేత ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. కరోనా కారణంగా జాప్యం జరిగిన బీసీ కార్పొరేషన్‌ కార్యాలయాలను ఈనెల 30వ తేదీన ప్రారంభించుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అందరూ ఇదే ఆహ్వానంగా భావించి హాజరు కావాలని ఆయన కోరారు. 
 
డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ, అధికారంలోకి రాక ముందు ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో చెప్పిన దాని కన్నా మిన్నగా జగన్‌ నేడు రాష్ట్రంలో బీసీలకు గౌరవం కల్పించినట్లు చెప్పారు. ఒక సామాన్య బీసీ కులంలో పుట్టిన తనను డిప్యూటీ సీఎం చేయడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు.

మేమెందుకు బీసీలుగా పుట్టలేదా అని మిగిలిన కులాల వారు అసూయ చెందేలా ఈ రాష్ట్రంలో బీసీల సంక్షేమం అమలవుతుందన్నారు. బీసీలకు ఎంతో మేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను కాపాడుకోవాల్సిన కనీస ధర్మం బీసీలుగా మనపైనే ఉందన్నారు.

ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా మనం మన కులాలను అన్ని రకాలుగా బలోపేతం చేసుకుంటూనే మరో పక్క ముఖ్యమంత్రికి జగన్‌కు అండదండలు అందిస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ వర్చువల్‌ మీటింగ్‌లో శాసనమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్ర«ధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు