అమ్మతోడు... మీరు నమ్మండి.. ఇది నీటి మడుగు కాదు.. రోడ్డే

గురువారం, 7 సెప్టెంబరు 2023 (11:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయంటూ విపక్ష పార్టీల నేతలతో పాటు ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. కానీ, అధికర పార్టీ నేతలు మాత్రం వీటిని మాటలతో తిప్పికొడుతున్నారు. అంతేకానీ, ఒక్క రోడ్డును బాగు చేసిన పాపాన పోలేదు. దీనికి గుంటూరు జిల్లా కాకునూరు - కొమ్మూరు గ్రామాల మధ్య  ఉన్న ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి కావడం గమనార్హం. 
 
జిల్లా కేంద్రం బాపట్లకు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. కానీ, ఈ రోడ్డు దుస్థితి చూస్తే బైర్లు కమ్మాల్సిందే. ఏకంగా నాలుగు కిలోమీటర్ల భారీగా గుంతలు పడ్డాయి. వీటిని పూడ్చకపోవడంతో వర్షం కురిస్తే చిన్నపాటి మడుగులుగా కనిపిస్తున్నాయి. కార్లు గుంతల్లో వెళ్లగానే ఆగిపోతున్నాయి. ఇక ద్విచక్రవాహనదారుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రోడ్డు అంచుల వెంబడి ప్రమాదకర స్థాయిలో వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఓ ఆటో గుంతను తప్పించే క్రమంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నా వారు ఏమాత్రం స్పందించక పోవడం శోచనీయం. 
 
దీంతో ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు.. ఈ రహదారిలో సీఎ జగన్ లేదా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తే రోడ్డు బాగుపడుతుందని కాకుమాను ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, సీఎం వస్తున్నారంటే నిధులతో సంబంధం లేకుండా అప్పటికప్పుడు రహదారుల నిర్మాణాలు చేపడతారు కదా?' అని ప్రశ్నిస్తున్నారు. ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారుల వాహనాలు కూడా ఉంటాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు