జే టాక్స్ కోసం బెంగాల్ యువకులను బంధించిన వైకాపా ఎమ్మెల్యే??

వరుణ్

ఆదివారం, 14 జనవరి 2024 (19:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు ఆగడాలు శృతిమించిపోతున్నాయంటూ విపక్ష నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నిజం చేసేలా ఏపీలో వైకాపా నేతలు, కార్యకర్తల తీరు ఉంది. తాజాగా జే-టాక్స్ కోసం బెంగాల్ యువకులను బంధించినట్టు సమాచారం. ఇదే విషయంపై అనంతపురం జిల్లా కలెక్టర్‌కు వెస్ట్ బెంగాల్ ఎంపీ ఫిర్యాదు చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై టీడీపీ ఘాటుగానే స్పందించింది. "జే టాక్స్ కోసం రాష్ట్ర పరువు తీస్తున్నారు వైసీపీ సైకోలు. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, బెంగాల్ పౌరులను బంధించారని అనంతపురం జిల్లా కలెక్టర్‌కు బెంగాల్ ఎంపీ ఫిర్యాదు చేయటం, మన రాష్ట్రానికే సిగ్గు చేటు.
 
అనంతపురం రూరల్ మండలంలోని కొడిమి ప్రభుత్వ లేఅవుట్ కాలనీ కాంట్రాక్ట్‌ను పశ్చిమ బెంగాల్ వ్యక్తి సర్వర్‌ జహాన్‌కు ఇచ్చారు. అతను బెంగాల్ నుంచి కూలీలను తెప్పించి ఆ పనులను పూర్తి చేస్తున్నారు. కాలనీ నిర్మిస్తున్నందుకు తమకు డబ్బులు ఇవ్వాలని, ఎమ్మెల్యే నేరుగా ఆ కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. అంతే కాకుండా డబ్బులు ఇవ్వలేదని స్థానిక పోలీసులకు చెప్పి కాంట్రాక్టర్‌ను అక్కడ పని చేసే కూలీలను అరెస్టు చేయించారు. 
 
జే-టాక్స్ కట్టలేదని ఆ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే 11 మంది కూలీలను నిర్బంధిస్తే పశ్చిమ బెంగాల్ ఎంపి కలెక్టర్, ఎస్పీకి లేఖ రాసారంటే, మన రాష్ట్ర పరువు పోయినట్టే. గతంలో కూడా ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధన దాహానికి, వేల మందికి ఉపాధి కల్పించే అవకాశమున్న జాకీ పరిశ్రమ పారిపోయిన సంగతి తెలిసిందే. జగన్ రెడ్డి శిష్యుల డబ్బు పిచ్చకి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త అయినా ముందుకు వస్తాడా? అంటూ టీడీపీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ పోస్ట్ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు