శ్రీకాళహస్తి ఆలయంలో రాహు, కేతు పూజల్లో దండుకుంటున్నారు

బుధవారం, 14 సెప్టెంబరు 2016 (12:00 IST)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతు పూజ చేయించుకుని దోషం పోగొట్టుకుందామనుకున్న భక్తులను దళారులు ఎన్ని విధాలుగా మోసం చేయాలో అన్ని విధాలా మోసం చేస్తున్నారు. భక్తుల జేబులను కొల్లగొట్టడమే కాదు.. ఒంటిపైన ఉన్న దుస్తులనూ వొలిచేస్తూ.. నిలువుదోపిడీ చేసేస్తున్నారు.
 
శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు పూజలతో దేశవ్యాప్తంగా ప్రాచూర్యం పొందింది. దోషం తొలగాలంటే శ్రీకాళహస్తిలో తప్ప ఇంకెక్కడా రాహు - కేతు పూజ చేసినా ఫలితం ఉండదన్న విశ్వాసం భక్తులది. అందుకే రోజూ 2,500 నుంచి 3 వేల పూజలు దాకా జరుగుతుంటాయి. సాధారణ భక్తుల నుంచి కోటీశ్వరులు దాకా రాహు - కేతు పూజలు చేయించుకుంటున్నారు.
 
సాధారణంగా ఆలయానికి వచ్చే భక్తులు ఖరీదైన పట్టుపంచె, పట్టుచీర ధరించి వస్తుంటారు. రాహు-కేతు పూజ అనంతరం తాము బస చేసిన గదిలో స్నానం చేసి ఇంటికి వెళుతుంటారు. అయితే రాహు-కేతు పూజ సమయంలో ధరించిన దుస్తులు కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలని దళారులు భక్తులకు చెబుతారు. దుస్తులు వదిలి వెళ్ళకుంటే దోషం పోదని పూజాఫలం లభించదని భయపెడతారు. దీంతో ఒంటిపైన ఎంత ఖరీదైన దుస్తులు ఉన్నా స్నానాల గదులు వద్ద, అద్దె గదుల వద్ద, లాడ్జీలలో వదిలిపెట్టి వెళుతున్నారు. 
 
దళారుల గురించి తెలియని భక్తులు వేలాది రూపాయల విలువజేసే పట్టుపంచెలు, పట్టుచీరలు ధరించి పూజలకు వెళుతుంటారు. పూజలకు వెళ్ళేటప్పుడు ఏమీ చెప్పని దళారులు పూజ ముగించుకుని వచ్చిన తర్వాత దుస్తులు కూడా వదిలిపెట్టాలని చెబుతారట. దీంతో విధిలేక అయిష్టంగానే దుస్తులు వదిలిపెట్టి పోతుంటారు. 
 
వీటిని తీసుకెళ్ళి డ్రైక్లీనింగ్‌ చేయించి మారుబేరానికి విక్రయిస్తున్నారట. భక్తులు వదిలివెళ్ళే దుస్తులను ఆలయ ఆవరణలోనే మూటగట్టి రోజూ ఆటోల్లో తీసుకెళుతుంటారు. కళ్లముందే కనిపిస్తున్నా దీన్ని గురించి పట్టించుకున్న వారేలేరు. వాస్తవంగా రాహు-కేతు పూజ అనంతరం దుస్తులు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదని ఆలయ అర్చకులే చెబుతున్నారు. 
 
రాహు-కేతు పూజల్లో అర్చకుల నుంచి ఆలయాన్ని శుభ్రం చేసే కార్మికుల దాకా కాసుల కోసం భక్తులను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మొన్నటి ఉదంతం రుజువు చేసింది. మలేషియాకు చెందిన భక్తులు రాహు-కేతు పూజ చేయించుకుంటే అక్కడున్న ఒక అర్చకుడు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారట. పూజ నిర్వహించిన ప్రాంతాన్ని శుభ్రం చేసే పేరుతో తనకూ డబ్బలివ్వాలంటూ ఒక పారిశుధ్య కార్మికురాలు భక్తులతో దురుసుగా ప్రవర్తించారట. ఈ విషయాన్ని ఆ భక్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో ఆమెను సస్పెండ్‌ చేశారు. రాహు-కేతు పూజల్లో వసూళ్లు ఏ మాత్రం ఆగలేదనడానికి ఈ ఒక్క ఉదంతమే చాలు. భ్రమరాంబ ఈఓగా వచ్చిన కొత్తలో పూజల వద్ద అక్రమంగా వసూలు చేసిన డబ్బులను తీసుకుని హుండీలో వేయించారు. అప్పుడు కొన్ని రోజులు వసూళ్ళు ఆగినా మళ్ళీ యధాతథంగా తతంగం నడుస్తోంది. దళారులు తమపని తాము చేసుకుపోతున్నారు.
 
దోష నివారణ కోసం వచ్చే భక్తులను మోసం చేయడం ఆలయంలో పరిపాటిగా మారిపోయింది. పైగా డబ్బులు ఇవ్వని భక్తులను అక్కడున్న కొందరు దూషిస్తున్నారట. శాపనార్థాలు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా భక్తులకు మనస్తాపం కలిగించే పనే మనశ్శాంతి కోసం దర్శనానికి వచ్చిన వారిలో అలా వ్యవహరించడం తీవ్రమైన తప్పిదంగా పరిగణించాలి. అలాంటివారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

వెబ్దునియా పై చదవండి