అలా గెలిచి ఇలా మారిపోతే ఎలా పవన్ గారు: వైఎస్ షర్మిల సెటైర్లు

ఐవీఆర్

శుక్రవారం, 4 అక్టోబరు 2024 (16:59 IST)
అన్ని మతాల వారి ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఇలా మారిపోతే ఎలా పవన్ కల్యాణ్ గారు అంటూ ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆమె ట్విట్టర్ ద్వారా... '' అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వేషం, భాషా రెండు మారాయి. సెక్యూలర్ పార్టీగా ఉన్న జనసేన కాస్త రైటిస్ట్ పార్టీగా మారిందా?
 
బాధ్యత కలిగిన పదవిలో ఉండి, ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకుని, ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే... ఇతర మతాలకు అభద్రతాభావం ఉండదా..? ఎన్నికల్లో వారి ఓట్లు మీకు పడలేదా..? ఇతర మతాల వాళ్ళకు మనోభావాలు ఉండవా..? మతం అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం RSS సిద్ధాంతమైతే.. అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ అయ్యాడు.
 
ప్రధాని మోడీ దర్శకత్వంలో యాక్టింగ్ చేసే మీకు శ్రీ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే నైతికత లేదు. మణిపూర్, గోద్రాలలో ఊచకోత కోసింది బీజేపీ పార్టీ కాదా..? అటువంటి పార్టీకి మద్దతు ఇచ్చిన మీరు లౌకికవాదం పాటించాలని చెప్తే నమ్మమంటారా..? ఈ దేశంలో ప్రేమ, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు రాహుల్ గాంధీ గారు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు'' అంటూ విమర్శలు సంధించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు