వైకాపా అభ్యర్థికి సపోర్టు.. బన్నీకి కౌంటరిచ్చిన జనసేన అభ్యర్థి

ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (17:08 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. ముఖ్యంగా, నవ్యాంధ్రలో 175 అసెంబ్లీ సీట్లకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ, వైకాపా, జనసేన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. దీంతో ఎన్నికల సమయం సమీపిస్తుండంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 
 
అయితే, ఈ ఎన్నికల్లో హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ తరపున అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఆయనకు మెగా ఫ్యామిలీ మొత్తం మద్దతు ఇస్తోంది. వీరిలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న నాగబాబుకు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్రమోహన్ రెడ్డికి మద్దతు పలికారు. శిల్పా రవిని గెలిపించాలంటూ అల్లు అర్జున్ ఓ ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు. ఇపుడు ఇది చర్చనీయాంశమైంది. 
 
ముఖ్యంగా, నంద్యాల్లో పోటీలో ఉన్న జనసేన అభ్యర్థికి ఇబ్బందికరమైన అంశంగా మారింది. నంద్యాల నుంచి జనసేన తరపున ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పోస్టు మీద శ్రీధర్ రెడ్డి స్పందించారు. నంద్యాల నియోజకవర్గంలో సిని నటుడు అల్లు అర్జున్ ప్రభావం ఏముంటుందని? అసలు అల్లు అర్జున్ ఏమైనా ఆ నియోజకవర్గం ఓటర్ కాదు ఆ ప్రాంతం వ్యక్తి కాదని అలాంటి వారి ప్రభావం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. 
 
పైగా, శిల్పా రవికి అల్లుఅర్జున్ మద్దతు పలకడం వెనుక వేరే కథ ఉందన్నారు. అల్లు అర్జున్ భార్య, శిల్పా రవి భార్యలు కలిసి పార్టీలకు వెళ్తారని అలా వారి మధ్య మంచి స్నేహం ఉందని ఆ స్నేహంతోనే ఇప్పుడు అల్లు సోషల్ మీడియా ద్వారా శిల్పా రవికి మద్దతు పలికారని శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది పెద్ద ప్రభావం చూపబోదని ఆయన వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు