కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

ఠాగూర్

మంగళవారం, 7 మే 2024 (13:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశాన్ని ఎన్నికల్లో ప్రస్తావించరాదంటూ కడప జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, షర్మిల మాత్రం ఈ ఆదేశాలను ఉల్లంఘించి వివేకా హత్య కేసును పదేపదే ప్రస్తావిస్తున్నారంటూ వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ నెల 2వ తేదీ బద్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని, ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు రాజకీయ నేతలను హెచ్చరించింది. 
 
బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించడం ద్వారా షర్మిల కోర్టు ఆదేశాలను ధిక్కరించారని బద్వేల్ నోడల్ అధికారి, బద్వేల్ మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా షర్మిలపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యను ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ నేత ఒకరు కడప కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని ఆదేశాలు జారీ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు