కేసీఆర్ ఢిల్లీ టూర్ : సోనియా - మన్మోహన్‌లతో భేటీ‌కి ఛాన్స్!

గురువారం, 1 ఆగస్టు 2013 (12:45 IST)
File
FILE
టీఆర్ఎస్ చీఫ్ కె. చంద్రశేఖర్ రావు ఈనెల నాలుగో తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఐదో తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వెళుతున్నారు.

అయితే, ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించినందున యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌లను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన కొన్ని గంటల్లోనే మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ మహిళా నేత విజయశాంతికి ఆ పార్టీ చీఫ్ కే చంద్రశేఖర్ రావు హ్యాండిచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు బుధవారం అర్థరాత్రి జారీ చేశారు.

కాంగ్రెస్‌లో చేరడానికి ఆమె ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పైపెచ్చు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం ప్రజల విజయమంటూ వ్యాఖ్యానించారు. ఇవి కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ శ్రేణులను ఆగ్రహానికి తెప్చించాయి. పైగా ఆ వార్తలను విజయశాంతి ఖండించలేదు. విజయశాంతిని సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం అర్థరాత్రి తర్వాత తెరాస పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విజయశాంతిని ఇప్పటికే అనేకసార్లు క్షమించాం. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు ఇస్తాం. పొలిట్‌బ్యూరో ఏకాభిప్రాయం మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలోని సారాంశం.

వెబ్దునియా పై చదవండి