మోత్కుపల్లి : జగన్ దీక్ష చేస్తున్నా ముఖంలో టెన్షన్ లేదు!

ఆదివారం, 1 సెప్టెంబరు 2013 (10:58 IST)
File
FILE
టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నిమ్స్ ఆస్పత్రిలో దీక్ష చేసిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినట్టుగానే జగన్ కూడా నిమ్స్ ఆస్పత్రిలో దొంగ దీక్ష చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు జగన్ ఎవరి కోసం దీక్ష చేస్తున్నారో స్పష్టం చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.

పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్‌కు జైల్లో సకల మర్యాదలు అందుతున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిలా కనిపించడం లేదని, జైలు జీవితాన్ని ఆనందిస్తున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడని అన్నారు.

జగన్‌కు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్టు ఆయన్ని చూస్తేనే తెలిసిపోతుందని మోత్కుపల్లి చెప్పారు. టీడీపీని రాజకీయంగా దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అయినప్పటికీ ఆ మూడు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మోత్కుపల్లి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి