చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. పూతలపట్టు- నాయుడుపేట రహదారిలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని దుకాణాలపైకి ఒక్కసారిగా లారీ దూసుకురావడంతో అక్కడి జనమంతా పరుగులు పెట్టారు. లారీ సృష్టించిన బీభత్సంతో అక్కడ విద్యుదాఘాతం కూడా చోటుచేసుకుంది. దీంతో లారీ కింద పడి కొందరు.. విద్యుత్ షాక్ తగిలి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
ఫలితంగా 20 మందికి పృగా చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఏర్పేడులోని పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న స్థానికులపై ఈ లారీ వేగంగా వచ్చి దూసుకెళ్లింది. దీంతో ఈ ఘోర విషాదం జరిగింది.
మరోవైపు ఈ ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలికి కలెక్టర్ ప్రద్యుమ్న బయలుదేరారు. మరోవైపు ఈ ఘోరప్రమాదంపై స్పందించిన హోం మంత్రి చినరాజప్ప తిరుపతి అర్బన్ ఎస్పీతో ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
క్షతగాత్రులకు మెరుగైన సౌకర్యం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు విచారం వ్యక్తం చేశారు. గాయాలపాలయిన వారిని రుయా, స్విమ్స్, శ్రీకాళహస్తి సీహెచ్సీ ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడి ట్రాఫిక్ను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.