పోలవరం నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధులు సరిపోవట్లేదు.. కానీ ప్యాకేజీలు ఇస్తున్నాం: బాబు

బుధవారం, 6 జులై 2016 (17:38 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోకపోయినా.. నిర్వాసితులకు మంచి ప్యాకేజీ ఇస్తున్నామని ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని పరిశీలించిన తర్వాత చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. 2018ల్లోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి తీరుతామన్నారు. పోలవరం నిర్మాణంపైృ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి నీటిని విడుదల చేశామన్నారు. ఏపీ ప్రజలకు నీటిభద్రత కల్పించాలన్నదే తన లక్ష్యమన్నారు. 302 రోజుల్లోనే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిన ఘనత ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వానిదేనని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ఏడాదిలోపు తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 
 
గోదావరి నీటిని సోమశిల వరకు తీసుకెళ్తామని, సముద్రంలో కలిసే నీటిని అంచనా వేసి దశలవారీగా ఉపయోగించుకుంటామని చంద్రబాబు తెలిపారు. 24 పంపుల ద్వారా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తున్నామని, ఈ ఏడాది కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు తరలించడమే లక్ష్యంగా పెట్టకున్నామని సీఎం పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి