రోడ్డు ప్రమాదం తనను కబళించినా ముగ్గురికి జీవనదానం చేసి వెలుగులు నింపిన అనంతపురం రైతు

మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (15:28 IST)
హృదయాంతరాళను తాకుతూ, అనంతపురంకు చెందిన 55 ఏళ్ల రైతు, ప్రాణాపాయంలో వున్న ముగ్గురికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. సెప్టెంబరు 10వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని గూటికి సమీపంలో తన మోటార్‌సైకిల్‌ను నాలుగు చక్రాల వాహనం ఢీకొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత అపరాల సుంకిరెడ్డిని తక్షణమే దగ్గర లోని KIMS (కెంపెగౌడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిలో చేర్చారు. కానీ గాయాల తీవ్రత కారణంగా ఆ తరువాత స్పందన ఆసుపత్రికి బదిలీ చేశారు. అప్పటికే పరిస్థితి విషమించటంతో, అధునాతన వైద్యం కోసం సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు యశ్వంత్‌పూర్‌లోని స్పర్ష్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
 
అక్కడి  వైద్య బృందం కృషి చేసినప్పటికీ, శ్రీ సుంకిరెడ్డి పరిస్థితి క్షీణించింది. సెప్టెంబర్ 14న బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంత దుఃఖంలో కూడా ఆ కుటుంబం అవయవాలను దానం చేయాలనే ఉదార నిర్ణయంతో ముందుకు వచ్చింది. అతని కాలేయం, కుడి కిడ్నీని యశ్వంత్‌పూర్‌లోని స్పర్ష్ ఆసుపత్రిలో రోగులకు విజయవంతంగా మార్పిడి చేయగా, మరో కిడ్నీని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోని మణిపాల్ ఆసుపత్రికి పంపారు.
 
ఈ మహోన్నత కార్యక్రమం గురించి స్పర్ష్ హాస్పిటల్ గ్రూప్ సిఓఓ జోసెఫ్ పసంఘ మాట్లాడుతూ, “అపరాల సుంకిరెడ్డి ఉదారమైన దానము, ఒక వ్యక్తి  పలువురి జీవితాలపై చూపే అపారమైన ప్రభావానికి నిదర్శనం. అతని మహోన్నత దానం ప్రాణాలను రక్షించడమే కాకుండా మన దేశంలో అవయవ దానం యొక్క ఆవశ్యకత గురించి అవగాహనను పెంచుతుంది" అని అన్నారు. 
 
అవయవ దానం ప్రోటోకాల్స్ ప్రకారం, కర్నాటక రాష్ట్రంలో శవ అవయవ దానాన్ని పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ సంస్థ SOTTO (స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్) అధికారులు అవయవ దానం ప్రక్రియను ప్రారంభించారు. కుటుంబ సభ్యుల నుండి వ్రాతపూర్వక అనుమతి తీసుకున్నారు. వెయిటింగ్ లిస్ట్ ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి అవయవాలను అమర్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు