కరోనా విపత్తు డబ్బు అడిగినందుకు కత్తితో నరికిన వాలంటీర్, ఎక్కడ?

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (19:55 IST)
అసలే కరోనా మహమ్మారితో లాక్ డౌన్ కొనసాగుతుంటే డబ్బులు లేక నిరుపేదలు విలవిలలాడిపోతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి చాలామందిది. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలాంటి వారి కోసం ప్రత్యేకంగా కరోనా విపత్తు కింద వెయ్యిరూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైంది. 
 
గత రెండురోజులుగా వెయ్యిరూపాయలను వాలంటీర్ల ద్వారా అర్హులైన రేషన్ కార్డుదారలందరికీ ఇళ్ళ వద్దకే వెళ్ళి డబ్బులను పంపిణీ చేయిస్తోంది ప్రభుత్వం. అయితే కొన్నిచోట్ల ఈ ప్రక్రియ బాగానే సాగుతూనే ఉన్నా మరికొన్ని చోట్ల మాత్రం అర్హులైన వారికి అందడం లేదన్న విమర్సలు వినిపిస్తున్నాయి. 
 
అయితే చిత్తూరుజిల్లా పీలేరు నియోజకవర్గం కె.వి.పల్లి మండలం బండవడ్డిపల్లిలో గ్రామంలో అర్హులైన వారికి వాలంటీర్ వెయ్యిరూపాయలు ఇవ్వడం లేదని విశ్వనాథరాజు అనే వ్యక్తి ప్రశ్నించాడు. వాలంటీర్ శ్రీనివాస్ పైన ఎమ్మార్వోకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు విశ్వనాథరాజు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వాలంటీర్ శ్రీనివాస్ విశ్వనాథరాజుపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసేందుకు ఇంటి నుంచి వెళుతున్న విశ్వనాథరాజుపై కత్తితో దాడి చేశాడు.
 
దీంతో విశ్వనాథ్ వీపు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన బాధితుడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. వాలంటీర్ శ్రీనివాస్‌తో వ్యక్తిగత కక్షలేమీ లేవని, కరోనా విపత్తు సాయాన్ని అడిగినందుకే తనపై కత్తితో దాడి చేశాడని బాధితుడు విశ్వనాథరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు