భార్యను పుట్టింటికి పంపించాడు, రెండో పెళ్ళి చేసుకుని ప్రత్యక్షమయ్యాడు

బుధవారం, 1 జులై 2020 (16:07 IST)
పెళ్ళి జరిగి ఐదేళ్ళవుతోంది. కానీ పిల్లలు లేరు. కుటుంబ సభ్యులతో పాటు బంధువుల ఒత్తిడి ఎక్కువైంది. శాపనార్థాలు పెట్టడం ప్రారంభించారు. తట్టుకోలేకపోయాడు భర్త. భార్యకు నచ్చజెప్పాడు. రెండో పెళ్ళి చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. భార్య అందుకు ఒప్పుకోలేదు. అయితే పుట్టింటికి వెళ్ళి వారం రోజులు ఉండిరా అని పంపాడు భర్త. ఆమె అలా వెళ్లగానే రెండో పెళ్ళి చేసుకుని ప్రత్యక్షమయ్యాడు.
 
నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం మోతే గ్రామానికి చెందిన నగేష్, భాగ్యలకు 2015 సంవత్సరంలో వివాహం జరిగింది. ప్రేమ వివాహం వీరు చేసుకున్నారు. పెళ్ళయిన తరువాత వీరి జీవితం సాఫీగానే సాగింది. నగేష్‌ సొంతంగా ప్రొవిజన్ షాపు నడుపుతున్నాడు. అయితే పెళ్ళయిన తరువాత పిల్లలు పుట్టలేదు.
 
ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. దేవుళ్ళకు మ్రొక్కారు. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో నగేష్ విసిగిపోయాడు. పిల్లలు లేని జీవితం వేస్ట్ అనుకున్నాడు. భార్యకు అనారోగ్య సమస్య ఉండటం వల్ల పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారు. దీంతో నగేష్ ఆమెను ప్రాధేయపడ్డాడు.
 
రెండో పెళ్ళి చేసుకుంటానని.. పిల్లల కోసం అవసరమని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అందుకు భార్య ఒప్పుకోలేదు. రెండునెలల పాటు ఇదే తంతు ఇంటిలో జరుగుతోంది. అయితే భాగ్యను ఇంటి నుంచి పంపిస్తే తన పని ఈజీ అయిపోతుందని భావించి పుట్టింటికి వెళ్ళి వారం రోజులు ఉండి ఆ తరువాత రా అంటూ పంపించాడు.
 
నిన్న భాగ్య తన పుట్టింటికి వెళ్ళింది. ఈ రోజు ఉదయం తన గ్రామంలోని వేంకటేశ్వరస్వామి గుడిలో రెండో వివాహం చేసుకున్నాడు నగేష్. నేరుగా ఇంటికి వచ్చాడు. నగేష్ తల్లిదండ్రులు కొత్త జంటను ఆహ్వానించారు. విషయం కాస్త భాగ్యకు తెలిసి లబోదిబోమంటూ పోలీస్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు