అటానమస్‌ కళాశాలల్లో అకడమిక్‌ ఆడిట్‌: విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

శుక్రవారం, 26 మార్చి 2021 (19:35 IST)
రాష్ట్రంలోని అన్ని అటానమస్‌ కళాశాలల్లో అకడమిక్‌ ఆడిట్‌ చేపడతామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌‌ స్పష్టం చేశారు. అటానమస్‌ ముసుగులో కొన్ని కళాశాలలు నాసిరకం విద్యను అందిస్తున్నాయన్నారు. దీనిపై ఫిర్యాదులు అందినట్లు చెప్పారు.

అమరావతి సచివాలయంలో శుక్ర‌వారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తమకు యూజీసీ ఆమోదం ఉందంటూ ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చని.. దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేయొచ్చన్నారు.

డిగ్రీ విద్యలో నాణ్యత పెంచాలనే ఉద్దేశంతోనే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇకపై అటానమస్‌ కళాశాలల్లో సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసే విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 109 కళాశాలలు అటానమస్‌ హోదా పొంది సిలబస్‌ రూపకల్పనతో పాటు సొంతంగా పరీక్షలు నిర్వహించాయని చెప్పారు.

పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. డిగ్రీ సాధించాక ఉద్యోగం వచ్చే పరిస్థితిని విద్యార్థులకు కల్పించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్రతి డిగ్రీ తరగతులకూ అప్రెంటిస్‌ విధానం అమలు చేస్తామన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విధానం పరిశీలించాకే ఈ మార్పులు చేపట్టామని తెలిపారు. ఏప్రిల్‌ 9న జగనన్న విద్యాదీవెన కింది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు