ఏర్పేడు ప్రమాదం ఇలా జరిగిందండీ.. మహిళా ఎస్పీ నిరాసక్త ప్రకటన
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (03:11 IST)
రైతులను నడిరోడ్డు మీద నిలిబెట్టి, పోలీసు స్టేషన్ గేట్లు మూసి నిలువునా 15 మంది ప్రాణాలను హరించిన ఘటనలో అసలు నేరస్తుల ఊసు గురించి ఒక్కమాట చెప్పలేదు. కానీ లారీ అతివేగంగా దూసుకురావడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని మహిళా ఎస్పీ అతి నిరాసక్తంగా చేసిన ప్రకటన బాధితుల పక్షాన కాకుండా నిందితులు, అధికార పార్టీ నేతల పక్షానే నిలిచిందా.. అంటే సమాధానం అవుననే చెప్పాలి..
చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఈ నెల 21న లారీ అతివేగంగా రావడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఆమె ఘటన వివరాలను మీడియాకు వెల్లడిం చారు. ఈ ఘటనలో లారీ దూసుకు పోవడం వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయపడ్డారన్నారు.
లారీలో ఇద్దరు డ్రైవర్లున్నారని, ఘటన జరిగిన వెంటనే ఒక డ్రైవర్ గురవయ్యను స్థానికులు పోలీసులకు అప్పగించారన్నారు. అతను మద్యం సేవించి ఉండడం వల్ల వైద్య పరీక్షలు చేయించి, భద్రతా కారణాల దృష్ట్యా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో లారీ నడుపుతున్న డ్రైవర్ సుబ్రమణ్యం అలియాస్ మణి, లారీ యజమాని రమేష్లు మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అక్కరపాక గ్రామం ఇన్చార్జి వీఆర్వో ముందు హాజరై సంఘటన జరిగిన తీరును వివరించారన్నారు.
వీఆర్వో ద్వారా సమాచారం అందుకున్న ఏర్పేడు పోలీసులు వారిద్దరినీ స్టేషన్లో డీఎస్పీ ముందు హాజరు పరిచారని చెప్పారు. వారిని విచారించగా లారీ యజమాని టి.రమేష్ వారికి లైసెన్స్ లేదని తెలిసినా చేర్చుకున్నాడని తేలిందన్నారు.
రైతులను గేటు బయట నింపి, ఇసుక తవ్వకంతో మాకు సంబంధం లేదని దులుపుకుని పోయిన మహిళా ఎస్పీ బాధ్యతా రాహిత్యం చివరకు ప్రమాద ఘటనపై చేసిన అధికారిక ప్రకటనలో కూడా స్పష్టంగా కనిపించింది. ఇక ఈ కేసు మూసివేతకు ఎంతో సమయం పట్టదని అనుభవజ్ఞులు తేల్చేస్తున్నారు.