నేను ఏ పార్టీలో లేను.. సీఎం జగన్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. సుమన్

ఆదివారం, 19 జూన్ 2022 (12:12 IST)
తాను ఏ రాజకీయ పార్టీలో లేనని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగినా అనుమతి ఇవ్వలేదని సీనియర్ హీరో సుమన్ వెల్లడించారు. విజయవాడ గ్రామీణ మండలం పి.నైనవరంలో సుమన్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆలిండియా అధ్యక్షుడు ధూళిపాళ్ల దేవేంద్ర భార్య నిర్మల మొదటి వర్థంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్లగా ఓటీటీ ప్రభావం పెరిగిందని, ఇదే సమయంలో వాటిల్లో వస్తున్న వెబ్‌ సిరీస్‌ల్లో అశ్లీలత చోటుచేసుకుంటుందన్నారు. దీనిపై ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తీస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. 
 
ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డు ఈ విషయమై దృష్టి సారించాలని సూచించారు. ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. లోకేషన్లు, పోలీసు బందోబస్తు, త్వరితగతిన అనుమతి మంజూరు వంటి సదుపాయాలు కల్పిస్తే చాలామంది ఇక్కడ సినిమాలు తీయడానికి ముందుకు వస్తారన్నారు 
 
ఇకపోతే, తాను ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేనని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కలిసేందుకు రెండు, మూడు సార్లు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌ దొరకలేదని వెల్లడించారు. తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం తెలియదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు